Nara Lokesh: ప్రభుత్వం రైతులకి అండగా నిలబడిన రోజే రైతు నిలబడతాడు: నారా లోకేశ్

  • వెంకటగిరి నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర
  • తెగచర్ల క్యాంప్ సైట్ వద్ద రైతులతో ముఖాముఖి
  • అధికారంలోకి వచ్చాక పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తామని వెల్లడి
  • జగన్ రైతుల పాలిట శనిగా మారాడని విమర్శలు
Nara Lokesh says governments must support farmers

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర కొనసాగించారు. తెగచర్ల క్యాంప్ సైట్ వద్ద రైతులతో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో లోకేశ్ ప్రసంగించారు. ప్రతి ఎకరానికి సాగు నీరు... ప్రతి ఇంటికి తాగునీరు అందించడమే టీడీపీ లక్ష్యం అని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చాక పెండింగ్ ప్రాజెక్టులన్నీ యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తామని భరోసా ఇచ్చారు. 

జగన్ రైతుల పాలిట శనిగా మారాడని విమర్శించారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ దేశంలోనే మూడో స్థానంలో ఉందని, కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉందని అన్నారు. 

"జగన్ పాలనలో భూసార పరీక్షా కేంద్రాలకు కరెంట్ బిల్లులు కట్టక మూతపడ్డాయి. రైతు రథాలు లేవు, డ్రిప్ ఇరిగేషన్ లేదు, గిట్టుబాటు ధర లేదు. నెల్లూరుకి చెందిన వ్యక్తి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన కోర్టు దొంగ. ఆయన జైలుకి పోవడం ఖాయం. అకాల వర్షాలతో రైతులు నష్టపోతే కనీసం పంట నష్టం అంచనా వేసే దిక్కు లేదు. ప్రతి నియోజకవర్గంలో ఏడాదికి 500 బోర్లు వేస్తాం అని జగన్ హామీ ఇచ్చాడు. ఒక్క బోరు కూడా వెయ్యడం లేదు. 

రైతు భరోసా కింద రూ.12,500 ఇస్తామని చెప్పి రూ. 7,500 ఇచ్చి చేతులు దులుపుకున్నారు. డ్రిప్ ఇరిగేషన్ ఎత్తేసి మెట్ట ప్రాంతం రైతుల్ని దెబ్బతీశాడు. ఒకే సంతకంతో రూ.50 వేల లోపు ఉన్న రుణాలు అన్ని మాఫీ చేసింది టీడీపీనే. 

ఇన్ పుట్ సబ్సిడీ, భూసార పరీక్షలు, సూక్ష్మ పోషకాలు అందించాం, రైతు రథాలు అందించాం, 90 శాతం సబ్సిడీతో డ్రిప్ ఇచ్చాం. పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చాం. పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేసి పంట కుంటలు ఏర్పాటు చేశాం. ఎన్టీఆర్ జలసిరి ద్వారా బోర్లు వేసి, సోలార్ మోటార్లు ఏర్పాటు చేశాం" అని వివరించారు.

జగన్ చేతిలో ఎక్కువ నష్టపోయింది రైతులే!

జగన్ వచ్చిన తరువాత రాష్ట్రం రైతులు లేని రాజ్యంగా మారిపోతోంది. జగన్ చేతిలో ఎక్కువ నష్టపోయింది రైతులే. జగన్ పాలనలో పాడి రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు. టీడీపీ హయాంలో గొర్రెల పెంపకం, పాడి పరిశ్రమ రైతులకి అనేక ప్రోత్సాహకాలు ఇచ్చాం. సబ్సిడీలో పశువులు, దాణా, మందులు, మేత అందించాం. 

జగన్ ప్రభుత్వం పాడి పరిశ్రమకు ఇచ్చే అన్ని సంక్షేమ కార్యక్రమాలను ఆపేసింది. రైతుల్ని ఆదుకోకపోగా మోటార్లకు మీటర్లు పెడుతున్నాడు. గ్యాస్ సబ్సిడీ ఎత్తేసినట్టే ఉచిత విద్యుత్ కూడా జగన్ ఎత్తేశాడు. రైతులు మీటర్లు పగలగొట్టండి. మీకు అండగా టీడీపీ ఉంటుంది. జగన్ పాలనలో విత్తనం, ఎరువులు, పురుగుల మందుల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి

ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తాం!

జగన్ పాలనలో వ్యవసాయం చెయ్యలేని పరిస్థితి వచ్చింది. నిమ్మ రైతుల కష్టాలు నాకు తెలుసు. రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తాం. మెరుగైన రకాల మొక్కలు తీసుకొస్తాం. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి మార్కెట్ తో లింక్ చేసి మంచి రేటు వచ్చేలా చేస్తాం. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పంటకు జబ్బులు వచ్చినప్పుడు ఏ మందు కొట్టాలో ప్రభుత్వమే చెప్పేలా అవగాహన సద్దస్సులు నిర్వహిస్తాం. 

టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 90 శాతం సబ్సిడీతో డ్రిప్ అందజేస్తాం. ఎస్సీ, ఎస్టీలకు అయితే 100 శాతం సబ్సిడీతో డ్రిప్ అందజేస్తాం. కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు సరఫరా చేస్తోంది వైసీపీ నాయకులే. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సరఫరా చేసే వారిపై చర్యలు తీసుకుంటాం. 

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కోఆపరేటివ్ జాయింట్ ఫార్మింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఉన్న 70 వేల ఎకరాలు బడుగు, బలహీన వర్గాల ప్రజలకు పూర్తి హక్కులు కల్పిస్తూ పట్టాలు ఇచ్చాం. చుక్కల భూముల పేరుతో వైసీపీ ప్రభుత్వం డ్రామా చేస్తుంది. వైసీపీ ప్రజాప్రతినిధులు వద్ద ఉండే అనుచరులకు తప్ప చుక్కల భూముల పట్టాలు ఎవరికీ ఇవ్వడం లేదు.

సోమశిల హైలెవల్ కెనాల్ పనులు పూర్తిచేస్తాం!

సోమశిల హై లెవల్ కెనాల్ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత యుద్ద ప్రాతిపదికన పూర్తి చేస్తాం. తోపుగుంట, కండాపురం, చౌటుపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను టీడీపీ వచ్చిన వెంటనే పూర్తి చేస్తాం. ఆల్తూరుపాడు రిజర్వాయర్ పనులు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి చేస్తాం. వెంకటగిరి నియోజకవర్గం రైతులకు సాగు నీరు అందించే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి చేస్తాం. 

టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్టుబడి వ్యయం తగ్గించి, గిట్టుబాటు ధర కల్పిస్తాం. హార్టి కల్చర్ ని ఉపాధి హామీకి అనుసంధానం చేసి ఆదుకుంటాం. పల్పింగ్ యూనిట్లు, ప్రాసెసింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజిలు ఏర్పాటు చేస్తాం. 

మామిడి రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేసి ఎగుమతికి కావాల్సిన రకాలు ఇక్కడ పెంచే విధంగా ప్రోత్సహిస్తాం. అసైన్డ్ భూముల సమస్యలు పరిష్కారం కోసం కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్న నిబంధనలు పాటించాలని నిర్ణయం తీసుకున్నాం.

ధాన్యం కొనుగోళ్లలో భారీ స్కామ్!

జగన్ పాలనలో వరి రైతులు తీవ్రంగా నష్టపోయారు. నెల్లూరు జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో భారీ స్కాంకి పాల్పడ్డారు. కొన్న ధాన్యానికి డబ్బులు వెయ్యడం లేదు. పెట్రోల్, డీజిల్ ధరల్లో జగన్ ఏపీని నెంబర్ వన్ చేశాడు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్రోల్, డీజిల్ పై పన్ను తగ్గిస్తాం. జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తాం. చంద్రన్న బీమా పథకాన్ని తిరిగి ప్రారంభిస్తాం. 

అమెరికా, యూకే లాంటి దేశాల్లో కూడా రైతులకు సబ్సిడీలు ఇస్తారు. గత సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు. ఏ పంట వెయ్యాలో చెప్పడం దగ్గర నుండి గిట్టుబాటు కల్పించే వరకూ ప్రభుత్వం రైతులకి అండగా నిలబడిన రోజే రైతు నిలబడతాడు. రైతు లేనిదే దేశం లేదు, రైతుకి అండగా నిలబడటం మా బాధ్యత.

*యువగళం పాదయాత్ర వివరాలు*

*ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 1670.4 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 16 కి.మీ.*

*131వ రోజు పాదయాత్ర వివరాలు (19-6-2023):*

*వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గం (తిరుపతి జిల్లా):*

సాయంత్రం

4.00 – పెనుబర్తి క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

5.00 – ఓబులాయపల్లిలో స్థానికులతో సమావేశం.

5.40 – అఖిలవలసలో గ్రామస్తులతో రచ్చబండ కార్యక్రమం.

7.10 – గుండువోలులో స్థానికులతో సమావేశం.

7.50 – ఏపూరులో రైతులతో సమావేశం.

8.20 – వెలిగోను జంక్షన్ లో గ్రామస్తులతో సమావేశం.

9.20 – రాపూరు శివారు విడిది కేంద్రంలో బస.

******

More Telugu News