danam nagender: హైదరాబాద్ రెండో రాజధాని అంటూ గందరగోళానికి గురి చేస్తున్నారు: దానం

  • విద్యాసాగర రావు ను బలిపశువును చేయడానికే ఇలాంటి ప్రకటనలు అంటూ విమర్శ
  • కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుండి ఎంపీగా గెలిచాక ఏం చేశారో చెప్పాలని నిలదీత
  • హైదరాబాద్, తెలంగాణ నుండి వస్తున్న రిసోర్సెస్ వల్లే ఆదాయం అన్న దానం
Danam Nagender fires at BJP for second capital issue

బీజేపీ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర రావు హైదరాబాద్ రెండో రాజధాని అంటూ చేసిన కామెంట్స్‌పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. తెలంగాణకు రెండో రాజధాని అంటూ బీజేపీ మళ్లీ మాటలు చెబుతోందని, భాగ్యనగర ప్రజలను గందరగోళానికి గురి చేయడానికే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. విద్యాసాగర రావు ను బలిపశువును చేయడానికే బీజేపీ ఇలాంటి ప్రకటనలు ఇప్పిస్తోందన్నారు.

తెలంగాణ అభివృద్ధిలో కేంద్రం ఎన్ని నిధులను రాష్ట్రానికి ఇచ్చిందో అందుకు సంబంధించిన వివరాలను రిపోర్ట్ టు పీపుల్ పేరుతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో దానం మీడియాతో మాట్లాడుతూ... కిషన్ రెడ్డి వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులను కేంద్రం ఇవ్వలేదని ఆరోపించారు. రాజ్యాంగపరంగా రావాల్సిన నిధులను కూడా కేంద్రం అడ్డుకుందన్నారు. ఎంపీగా గెలిచి నాలుగేళ్లవుతోందని, ఈ కాలంలో సికింద్రాబాద్ కు కిషన్ రెడ్డి ఏం చేశారో చెప్పాలని నిలదీశారు.

హైదరాబాద్, తెలంగాణ నుండి వస్తోన్న రిసోర్సెస్ వల్లే రాష్ట్రానికి ఆదాయం వస్తోందని చెప్పారు. ఈ కారణంగానే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతోందన్నారు. కిషన్ రెడ్డి మాయమాటలు పక్కన పెట్టి, ఇప్పటికైనా కేంద్రం తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులను ఇవ్వాలని డిమాండ్ చేశారు.

More Telugu News