Komatireddy Venkat Reddy: మేమంతా కలిసిపోయాం... విభేదాలు లేవని మేడంకు చెప్పాను: కోమటిరెడ్డి వెంకటరెడ్డి

  • సోనియా, ప్రియాంకలను కలిసిన కోమటిరెడ్డి
  • తాజా రాజకీయ పరిస్థితులపై వారితో చర్చించినట్టు వెల్లడి
  • సోనియా వీలుంటే ఖమ్మం సభకు వస్తానన్నారన్న ఎంపీ
Komatireddy Venkat Reddy met Sonia Gandhi and Priyanka Gandhi Vadhra

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ అగ్రనేత సోనియా గాంధీ, ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీలను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ఇటీవల పరిణామాలపై కాంగ్రెస్ అగ్రనేతలతో చర్చించినట్టు వెల్లడించారు.

తెలంగాణ పరిస్థితులను సోనియా గాంధీ సానుకూలంగా విన్నారని తెలిపారు. ఖమ్మం సభకు రావాలని ఆమెను కోరానని, వీలుంటే వస్తానని చెప్పారని కోమటిరెడ్డి వివరించారు. 

అంతేకాదు, తెలంగాణలో కాంగ్రెస్ నేతలం అందరం కలిసిపోయామని, ఇప్పుడు తమ మధ్య విభేదాలు లేవని కూడా మేడంకు చెప్పానని వెల్లడించారు. ఒకరి పాదయాత్రకు మరొకరు సహకరించుకుంటున్నామని ఆమె దృష్టికి తీసుకెళ్లానని వివరించారు. కర్ణాటక పద్ధతిలోనే తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లను ముందే ప్రకటించాలని కోరగా, జులై 7 తర్వాత దీనిపై సమాచారం ఇస్తామని తెలిపారని పేర్కొన్నారు. 

ఇక, కర్ణాటక స్ఫూర్తిగా తెలంగాణలోనూ పోరాడాలని, ఐకమత్యంతో ముందుకు కదలాలని ప్రియాంక గాంధీ సూచించారని కోమటిరెడ్డి  వెంకట్ రెడ్డి వెల్లడించారు.

More Telugu News