Congress: పరువు నష్టం కేసులో రాహుల్, సిద్ధరామయ్య, డీకేలకు కోర్టు నోటీసులు

  • కర్ణాటక ఎన్నికల సమయంలో 40 శాతం కమీషన్ అంటూ కాంగ్రెస్ ప్రచారం
  • నిరాధార ఆరోపణలు చేశారంటూ కోర్టుకెక్కిన బీజేపీ నేత
  • కాంగ్రెస్ నేతలకు నోటీసులు జారీ చేయాలని ఆదేశాలు
Court issues summons to Congress leaders

కర్ణాటకలో గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీపై కాంగ్రెస్ నేతలు తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు తమ పార్టీకి తీవ్ర నష్టం కలిగించేవిగా ఉన్నాయంటూ బీజేపీ నేత ఒకరు కోర్టును ఆశ్రయించారు. దీంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కు బెంగళూరులోని స్పెషల్ కోర్టు సమన్లు జారీ చేసింది.

కర్ణాటకలో ఇటీవలి వరకు ఉన్న బీజేపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందంటూ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఆరోపించింది. బీజేపీ ప్రభుత్వం 40 శాతం కమీషన్ కు పాల్పడిందని, దీంతో గత నాలుగేళ్లలో రూ.1.5 లక్షల కోట్లు దోచేసిందని పేపర్లలో ప్రకటనలు ఇచ్చింది.

అయితే నిరాధార ఆరోపణలు చేసిందంటూ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కేశవప్రసాద్ మే 9న ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలు బీజేపీకి నష్టం కలిగించేవిలా ఉన్నాయని ప్రైవేటు పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కాంగ్రెస్ నేతలకు నోటీసులు జారీ చేయాలని అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను జులై 27కు వాయిదా వేసింది.

More Telugu News