Anand Mahindra: కదిలే మంచంపై ఆనంద్ మహీంద్రా రియాక్షన్

  • మంచాన్ని వాహనంగా మార్చుకున్న యువకుడు
  • దానిని ప్రాంక్ వీడియో అని పొరపడినట్టు పేర్కొన్న మహీంద్రా 
  • ప్రాణాలను కాపాడుతుందేమో ఎవరికి తెలుసంటూ ట్వీట్ 
Anand Mahindra thinks that this charpai vehicle can be a lifesaver in remote areas

ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ అధినేత ఆనంద్ మహీంద్రా ఓ సరికొత్త వాహనంపై స్పందించారు. అరుదైన, వింతైన విశేషాలను తన ట్విట్టర్ పేజీపై తరచుగా ఫాలోవర్లతో పంచుకోవడం ఆయన హాబీ. సామాన్యులు సైతం రూపొందించిన ఎన్నో వాహనాలను ఆనంద్ మహీంద్రా గతంలో అభినందించిన సందర్భాలు ఉన్నాయి. స్క్రాప్ నుంచి తయారుచేసిన ఓ వాహనాన్ని తమకు ఇస్తే, కొత్త బొలెరో వాహనం ఇస్తామంటూ ఆయన ఆఫర్ చేశారు. అన్నట్టుగానే కొత్త వాహనం ఇచ్చారు కూడా. 

అలాంటి ఆనంద్ మహీంద్రా, ఓ వ్యక్తి రూపొందించిన సరికొత్త వాహనాన్ని షేర్ చేశారు. ఓ వ్యక్తి మంచానికి మోటారు ఏర్పాటు చేసుకున్నాడు. నాలుగు కోడుల స్థానంలో చక్రాలు బిగించి, ఎంచక్కా వాహనం మాదిరిగా నడుపుతున్నాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లోకి చేరడంతో, కొంత మంది నెటిజన్లు ఈ వీడియోని ఆనంద్ మహీంద్రాకు పంపిస్తున్నారు. దీంతో ఆయన దీనిపై స్పందించారు.

‘‘నేను కనీసం ఓ పది మంది స్నేహితుల నుంచి ఈ వీడియోని అందుకున్నాను. ఎదుటి వారి దృష్టిని ఆకర్షించేందుకు చిలిపిగా రూపొందించిన వాహనం అని అనుకున్నాను. పైగా ఇది నిబంధనలను ఉల్లంఘించేదిగా ఉంది. మారుమూల ప్రాంతాల్లో అత్యవసర సమయాల్లో ప్రాణాలను ఇది కాపాడుతుందేమో ఎవరికి తెలుసు?’’ అని ఆనంద్ మహీంద్రా స్పందన వ్యక్తం చేశారు. 

More Telugu News