Mumbai: సహజీవనం చేస్తున్న మహిళను చంపేసి.. ముక్కలు చేసి.. ఆపై కుక్కర్‌లో ఉడకబెట్టి.. 56 ఏళ్ల వ్యక్తి ఘాతుకం!

  • ముంబైలోని ఓ ప్రైవేటు అపార్ట్‌మెంటులో దారుణం
  • ఫ్లాట్ నుంచి దుర్వాసన వస్తుండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చిన ఇరుగుపొరుగువారు
  • హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్న పోలీసులు
Mumbai man kills live in partner and chops body into pieces with tree cutter

ముంబైలో ఓ వ్యక్తి అత్యంత కర్కశంగా ప్రవర్తించాడు. తన లివిన్ పార్ట్‌నర్‌ (సహజీవన భాగస్వామి)ను చంపేసి ముక్కలు చేసి, ఆపై వాటిని కుక్కర్‌లో వేసి ఉడకబెట్టాడు. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైలోని మీరా రోడ్డులో ఓ అపార్ట్‌మెంట్‌లో మనోజ్ సహానీ (56), సరస్వతి వైద్య (36)తో కలిసి మూడేళ్లుగా ఉంటున్నాడు. తాజాగా, అతడి ఇంటి నుంచి దుర్వాసన వస్తుండడంతో ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

అక్కడికి చేరుకున్న పోలీసులకు మనోజ్ ఫ్లాట్‌లో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మహిళ మృతదేహం కనిపించింది. శరీరాన్ని చెట్లను కట్ చేసేందుకు ఉపయోగించే కట్టర్‌తో నిందితుడు ముక్కలుగా కోసినట్టు గుర్తించారు. ఆ తర్వాత కొన్ని శరీరభాగాలను కుక్కర్‌లో వేసి ఉడకబెట్టి సాక్షాధారాలు లేకుండా చేసే ప్రయత్నం చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ హత్య వెనక కారణాలపై ఆరా తీస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు తెలిపారు. 

కాగా, గతేడాది ఢిల్లీలో జరిగిన శ్రద్ధా వాకర్ హత్య కూడా ఇలానే సంచలనమైంది. లివిన్ పార్ట్‌నర్ అయిన అఫ్తాబ్ పూనావాల ఆమె శరీరాన్ని ముక్కలు చేసి మూడు వారాలపాటు ఫ్రిడ్జ్‌లో దాచాడు. ఈ కేసులో ఈ ఏడాది జనవరిలో ఢిల్లీ పోలీసులు 6,629 పేజీల చార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు.

More Telugu News