ఒడిశా రైలు ప్రమాదం: కన్నీరు పెట్టిస్తున్న ఓ తండ్రి వెతుకులాట.. వీడియో!

  • కొడుకు కోసం శవాల ముసుగు తీసి చూస్తున్న తండ్రి
  • ఆసుపత్రుల చుట్టూ తిరిగినా కనిపించని కొడుకు
  • 288కి చేరిన రైలు ప్రమాద మృతుల సంఖ్య
ఒడిశా రైలు ప్రమాదంలో గల్లంతయిన కొడుకు కోసం ఓ తండ్రి వెతుకుతున్న తీరు చూపరులను కన్నీరు పెట్టిస్తోంది. ప్రమాదానికి గురైన రైలులో కొడుకు ప్రయాణించాడని, ఇప్పుడు తన ఆచూకీ దొరకడంలేదని వాపోతున్నాడా తండ్రి. గాయపడ్డవారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తుండడంతో అక్కడ కూడా చూశానని చెబుతున్నాడు. బాధితులను తీసుకెళ్లిన అన్ని ఆసుపత్రుల చుట్టూ తిరిగానని, ఎక్కడా తన కొడుకు కనపడలేదని చెప్పాడు. దీంతో మృతదేహాలను ఉంచిన మార్చురీలో వెతుకుతున్నట్లు కన్నీటి మధ్య తెలిపాడు.

మార్చురీలో నేలపై వరుసగా పడుకోబెట్టిన మృతదేహాల దగ్గరికి వెళ్లి ఒక్కొక్క శవంపైన ముసుగు తొలగిస్తూ చూస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదంటూ వీడియో చూసిన వారు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఈ రైలు ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య 288కి చేరింది. ఇంకా చాలామంది ఆచూకీ దొరకడంలేదని అధికారులు చెబుతున్నారు. ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న వారిలోనూ పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

searching
Odisha train accident
dead bodies
missing persons
mortuary
father search for son

More Telugu News