Joe Biden: ‘నా గుండె పగిలింది’.. ఒడిశా రైలు విషాదంపై జో బైడెన్

  • ఒడిశా విషాదంలో 288 మంది మృతి
  • తమ హృదయాలు ద్రవించిపోయాయన్న జో బైడెన్
  • బాధితుల తరపున ప్రార్థిస్తున్నట్టు చెప్పిన అధ్యక్షుడు
Joe Biden Says He Is Heartbroken By Odisha Train Crash

ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషాదం గురించి తెలిసి తన గుండె పగిలిందని వ్యాఖ్యానించారు. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో 288 మంది ప్రాణాలు కోల్పోగా 1,100 మంది గాయపడ్డారు.  ప్రమాదంలో తొలుత కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ లూప్‌లైన్‌లో ఆగివున్న గూడ్సు రైలును ఢీకొట్టడంతో దాని బోగీలు చెల్లాచెదురుగా పడ్డాయి. అదే సమయంలో పక్క ట్రాక్ నుంచి వస్తున్న మరో రైలు పట్టాలపై పడిన బోగీలను ఢీకొట్టడంతో పెను ప్రమాదం సంభవించింది. 

ఈ విషాదంపై జో బైడెన్ స్పందించారు. ఈ ఘోర ప్రమాదం గురించి తెలిసి తనతోపాటు ప్రథమ పౌరురాలైన జిల్ బైడెన్ హృదయాలు విషాదంలో మునిగిపోయాయని అన్నారు. ప్రమాదంలో ప్రియమైన వారిని కోల్పోయిన వారు, గాయపడిన వారి కోసం ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు. అమెరికా, భారత్ మధ్య సాంస్కృతిక, కుటుంబ బంధాలు బలంగా పెనవేసుకుపోయాయని అన్నారు. ఒడిశా ప్రమాదంపై అమెరికా ప్రజలందరూ సంతాపం తెలుపుతున్నట్టు బైడెన్ పేర్కొన్నారు.

More Telugu News