రైలు ప్రమాదానికి బాధ్యతగా మోదీ రాజీనామా చేయాలన్న కేఏ పాల్

ఒడిశా ఘోర రైలు ప్రమాదంపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం చాలా దురదృష్టకరమని అన్నారు. ప్రమాదంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోవడం కలచివేస్తోందని చెప్పారు. ఈ ప్రమాదానికి ప్రధాని మోదీ బాధ్యత వహించాలని, పీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 

రైల్వే శాఖ మంత్రి ఎవరో ఎవరికీ తెలియదని... అన్ని శాఖలను మోదీ తన గుప్పిట్లో పెట్టుకున్నాడు కాబట్టి ఈ ఘటనకు కూడా ఆయనే బాధ్యుడని అన్నారు. బాధ్యులైన అధికారులందరినీ విధుల నుంచి తొలగించాలని చెప్పారు. ఇంత ఘోరమైన రైలు ప్రమాదం ప్రపంచంలో గత 40 ఏళ్లలో ఎక్కడా జరగలేదని అన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.


More Telugu News