Chandrababu: సత్తెనపల్లి ఇంచార్జిగా కన్నా.. కోడెల ఫ్యామిలీకి న్యాయం చేస్తామని బాబు హామీ ఇచ్చారన్న టీడీపీ

  • కన్నాను ఇంచార్జిగా నియమించడంపై కోడెల శివరాం అసంతృప్తి
  • శివరాంతో టీడీపీ త్రిసభ్య సమావేశం
  • శివరాం సహా కోడెల అభిమానులకు అసంతృప్తి సహజమేనన్న ఆనంద్ బాబు
  • శివరాంను చంద్రబాబు పిలిచి మాట్లాడుతారని చెప్పిన మాజీ మంత్రి
Chandrababu Naidu promises to Kodela family on ticket

కోడెల కుటుంబానికి న్యాయం చేస్తానని తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు తెలిపారు. సామాజిక సమీకరణాల దృష్ట్యా కన్నా లక్ష్మీనారాయణను సత్తెనపల్లి నియోజకవర్గం ఇంచార్జిగా నియమించినట్లు తెలిపారు. దీనిపై కోడెల శివరాంతో పాటు అభిమానులకు బాధ సహజమేనని, వారి సమస్యను తీర్చేందుకు పార్టీ చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. శివరాంను త్వరలో చంద్రబాబు పిలిచి మాట్లాడుతారని మరో నేత జీవీ ఆంజనేయులు చెప్పారు. పార్టీ శ్రేణులు అంతా కలిసి పని చేయాలని అధినేత సూచించినట్లు చెప్పారు.

కాగా, సత్తెనపల్లి ఇంచార్జిగా కన్నాను నియమించడంపై కోడెల శివరాం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో సత్తెనపల్లిలో శివరాంతో టీడీపీ త్రిసభ్య బృందం శుక్రవారం భేటీ అయింది. ఆయనతో చర్చలు జరిపింది. ఈ సమావేశం అనంతరం సీనియర్ నేతలు నక్కా ఆనంద బాబు, జీవీ ఆంజనేయులు మీడియాతో మాట్లాడారు. కాగా, త్రిసభ్య బృందం తిరిగి వెళ్తుండగా శివరాం అనుచరులు కాసేపు అడ్డుకున్నారు. కార్ల ముందు బైఠాయించి సత్తెనపల్లి అభ్యర్థిగా శివరాంను ప్రకటించాలని డిమాండ్ చేశారు. వారికి నేతలు నచ్చజెప్పి, అక్కడి నుండి వెళ్లిపోయారు.

More Telugu News