డబ్బుకు ఆశపడి వరంగల్ లో కొడుకును అమ్ముకున్న తండ్రి?

Four year old boy sold by his father in Warangal District
  • సంచలనం సృష్టిస్తున్న నాలుగేళ్ల బాలుడి అమ్మకం
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలుడి మేనమామ
  • బంధువులకు పెంచుకోవడానికి ఇచ్చానంటూ బుకాయిస్తున్న తండ్రి
డబ్బు కోసం కన్నతండ్రే బిడ్డను అమ్ముకున్న ఘటన వరంగల్ జిల్లాలో సంచలనం సృష్టించింది. విషయం తెలిసి బాలుడి మేనమామ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పెంచుకోవడానికి బంధువులకు ఇచ్చానంటూ ఆ తండ్రి బుకాయించాడు. దీంతో నిజానిజాలు తేల్చేందుకు, బాలుడి ఆచూకీ తెలుసుకునేందుకు వరంగల్ జిల్లా పోలీసులు విచారణ ప్రారంభించారు.

కరీమాబాద్‌కు చెందిన మసూద్‌ నాలుగేళ్ల కొడుకు అయాన్ ఇటీవల అదృశ్యమయ్యాడు. బాలుడు కనిపించక ఇంట్లో వాళ్లు ఆందోళన చెందుతున్నా తండ్రి పట్టించుకోలేదు. ముఖ్యంగా బిడ్డ కనిపించకపోవడంతో తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. భర్త పట్టించుకోకపోవడంతో తన సోదరుడితో చెప్పుకుని ఏడ్చింది. దీంతో అక్క ఇంటికి వచ్చిన అక్బర్.. బావ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డబ్బుకు ఆశపడి గుట్టుచప్పుడు కాకుండా కొడుకును అమ్మేశాడని ఆరోపించాడు. 

కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మసూద్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. కొడుకును అమ్మలేదని, పోచమ్మ మైదాన్ లో ఉంటున్న తమ బంధువులకు పెంచుకోవడానికి ఇచ్చానని మసూద్ వెల్లడించాడు. ఇందులో నిజానిజాలను తేల్చేందుకు పోలీసులు విచారణ జరుపుతున్నారు. కేసును మిల్స్ కాలనీ స్టేషన్ నుంచి మట్టెవాడ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేసినట్లు వివరించారు. అయితే, బంధువులకు పెంచుకోవడానికి ఇస్తే ఇంట్లో వాళ్లకు తెలియకుండా చేయాల్సిన అవసరమేంటని అక్బర్ సందేహం వ్యక్తం చేస్తున్నారు.
Go Back to Shorts
Kid sold
Warangal
four year kid

More Telugu News