wrestlers: నవ్వుతున్నట్లుగా.. తమ ఫొటోలను మార్ఫింగ్ చేశారంటున్న రెజ్లర్లు

  • నెల రోజులుగా ఢిల్లీలో రెజ్లర్ల నిరసన
  • పార్లమెంటు భవనం వైపు ర్యాలీగా వెళ్తుండగా అరెస్ట్ చేసిన పోలీసులు
  • పోలీసు వాహనంలో నవ్వుతున్నట్లుగా వచ్చిన పొటోలపై వివరణ  
Smiley selfies of wrestlers are fakes morphed

డబ్ల్యూఎఫ్ఐ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్‌ సింగ్‌ కు వ్యతిరేకంగా భారత రెజ్లర్లు నెల రోజులుగా ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద నిరసన తెలుపుతున్నారు. వీరి ఆందోళనపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దీంతో రెజ్లర్లు ఆదివారం కొత్త పార్లమెంటు భవనం వైపు ర్యాలీకి ప్రయత్నించగా, ఢిల్లీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. సాక్షి మాలిక్‌, వినేశ్‌ ఫోగట్, బజరంగ్‌ పునియాతో పాటు ఇతర ఆందోళనకారులను నిర్బంధించి పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

రెజ్లర్లను బలవంతంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని బస్సుల్లో ఎక్కించి వేర్వేరు ప్రాంతాలకు తరలించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారాయి. ఫొటోల్లో వినేశ్‌ ఫోగట్‌, సంగీత ఫోగట్‌ పోలీసు వాహనంలో కూర్చుని నవ్వుతూ సెల్ఫీ తీసుకుంటున్నట్లు ఉంది. ఈ ఫొటోలపై రెజ్లర్లు తీవ్రంగా స్పందించారు. తమ ఫొటోలను కొందరు మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారని మండిపడ్డారు. కొంతమంది ఈ తప్పుడు చిత్రాన్ని ప్రచారం చేస్తున్నారని, ఈ నకిలీ ఫొటోను పోస్ట్‌ చేసిన వారిపై ఫిర్యాదు చేస్తామని చెబుతున్నారు.

ఆ ఫొటోలన్నీ మార్ఫింగ్ చేసినవని రెజ్లర్ సాక్షి మాలిక్ అన్నారు. ఇలాంటి చీప్ ట్రిక్స్ తో తమను కించపరచాలని చూస్తున్నారన్నారు. అవి నిజమైన ఫొటోలు కావని, కొంతమంది కావాలనే మార్ఫింగ్‌ చేశారని, అలాంటి వారికి సిగ్గు లేదన్నారు. వారిని దేవుడు ఎలా సృష్టించాడో అర్థం కావడం లేదని, తమకు చెడ్డపేరు తీసుకొచ్చేందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

More Telugu News