పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లికి సిద్ధమయ్యాడు.. కట్నం చాల్లేదని పీటలపై నుంచి పరారయ్యాడు!

groom demand Rs 15 lakhs to marry lover in Sangareddy dist
ప్రేమించిన అమ్మాయి కోసం పెద్దలను ఎదిరించి పెళ్లికి రెడీ అయిన యువకుడు కట్నం కోసం పెళ్లి పీటల నుంచి పరారయ్యాడు. సంగారెడ్డి జిల్లా మానూరు మండలంలో జరిగిందీ ఘటన. మండలానికి చెందిన యువతి, కొండాపూర్ మండలానికి చెందిన యువకుడు ప్రేమించుకున్నారు. అందరిలానే వీరి ప్రేమను కూడా పెద్దలు నిరాకరించారు. అతడికిచ్చి పెళ్లి చేసేది లేదని తేల్చిచెప్పిన యువతి తల్లిదండ్రులు ఈ ఏడాది జనవరిలో కంగ్టి మండలానికి చెందిన యువకుడితో నిశ్చితార్థం జరిపించారు. 

విషయం తెలిసిన ప్రేమికుడు ఆ యువకుడికి ఫోన్ చేసి తాను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానని, వదిలేయాలని బెదిరించాడు. అతడు పెళ్లికి నిరాకరించడంతో చేసేదిలేక ప్రేమించిన యువకుడికిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించారు. నిన్న కొండాపూర్ మండలంలోని ఓ గుడిలో పెళ్లికి ఏర్పాట్లు చేశారు. ఇరు కుటుంబాల వారు ఆలయానికి చేరుకుని పెళ్లి ఏర్పాట్లు చేశారు.

మరికాసేపట్లో పెళ్లి జరగాల్సి ఉండగా తనకు రూ. 15 లక్షల కట్నం ఇస్తేనే ప్రేమికురాలి మెడలో తాళి కడతానని చెప్పి పట్టుబట్టాడు. అంత ఇచ్చుకోలేమని, రూ. 6 లక్షలు ఇస్తామని యువతి కుటుంబ సభ్యులు చెప్పినా వరుడు వినిపించుకోలేదు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. ఫోన్ కూడా స్విచ్చాఫ్ చేసుకోవడంతో వధువు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Go Back to Shorts
Telangana
Sangareddy District
Lover
Love Marriage

More Telugu News