Tippu Sultan: టిప్పుసుల్తాన్ ఖడ్గానికి వేలంలో కళ్లుచెదిరే ధర

  • 18వ శతాబ్దం నాటి ఖడ్గాన్ని వేలం వేసిన లండన్ సంస్థ
  • రూ.144 కోట్లకు కొనుగోలు చేసిన వ్యక్తి 
  • ఆ వ్యక్తి వివరాలు వెల్లడించని వేలం సంస్థ
  • గతంలో ఇదే ఖడ్గాన్ని వేలంలో కొనుగోలు చేసిన విజయ్ మాల్యా
  • కలిసిరాలేదంటూ ఆ తర్వాత అమ్మేసిన వైనం
Sword of Tippu Sultan garners huge price in auction

భారతీయ ముస్లిం పాలకుడు, మైసూర్ రాజు టిప్పు సుల్తాన్ ఉపయోగించిన ఖడ్గం బ్రిటన్ లో నిర్వహించిన వేలంలో కళ్లు చెదిరే ధర పలికింది. ఈ చారిత్రక ఖడ్గాన్ని లండన్ లో బోన్హామ్స్ ఆక్షన్ హౌస్ వేలం వేసింది. ఓ వ్యక్తి ఈ అపురూపమైన ఖడ్గాన్ని రూ.144 కోట్లకు దక్కించుకున్నాడు. 

ఈ వేలంలో ముగ్గురి మధ్య హోరాహోరీ నెలకొనగా, అత్యధిక మొత్తంలో బిడ్డింగ్ వేసిన వ్యక్తిని ఈ కత్తి వరించింది. అయితే, టిప్పు ఖడ్గాన్ని వేలంలో దక్కించుకున్న వ్యక్తి వివరాలను బోన్హామ్స్ సంస్థ గోప్యంగా ఉంచింది. అంతేకాదు, ఆ ఖడ్గాన్ని తాము ఎవరి వద్ద నుంచి కొనుగోలు చేసింది కూడా ఆ సంస్థ రహస్యంగా ఉంచింది. తాము అంచనా వేసిన ధర కంటే ఏడు రెట్లు ఎక్కువ ధరను ఈ ఖడ్గం రాబట్టిందని బోన్హామ్స్ సంతోషం వ్యక్తం చేసింది. 

కాగా,  18వ శతాబ్దం నాటి ఈ ఖడ్గాన్ని మాజీ లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా 2003లోనే ఓ వేలంలో కొనుగోలు చేశాడు. అయితే ఈ ఖడ్గం తన ఇంటికి వచ్చాక తనకు కలిసిరాలేదని, అందుకే విక్రయిస్తున్నట్టు అప్పట్లో మాల్యా చెప్పారు. ఆ మేరకు మీడియా కథనాలు వచ్చాయి.

More Telugu News