Rahul Gandhi: మీరు నాతోనే ఉన్నారు నాన్నా.. రాజీవ్ గాంధీకి నివాళులర్పించిన రాహుల్ గాంధీ!

  • రాజీవ్ 32వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన కుటుంబ సభ్యులు, నేతలు
  • ఆయన జ్ఞాపకాలతో కూడిన వీడియోను షేర్ చేసిన రాహుల్
  • హరివంశ్ రాయ్ బచ్చన్ రాసిన కవితను పోస్ట్ చేసిన ప్రియాంక
papa you are with me as inspiration rahul emotional tribute to father rajiv Gandhi

భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 32వ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, దేశవ్యాప్తంగా నేతలు ఘన నివాళులు అర్పించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తదితరులు.. ఈ రోజు ఉదయం ఢిల్లీలోని వీర్‌భూమికి చేరుకున్నారు. రాజీవ్ సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు.

అంతకుముందు రాహుల్ భావోద్వేగంతో కూడిన ట్వీట్ చేశారు. ‘‘పాపా.. మీరు నాతోనే ఉన్నారు.. మీరే స్ఫూర్తి.. మీ జ్ఞాపకాలు ఎప్పటికీ మాతోనే ఉంటాయి’’ అని పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ జ్ఞాపకాలతో కూడిన ఒక వీడియోను షేర్ చేశారు. ప్రియాంకా గాంధీ కూడా తన తండ్రిని స్మరించుకుంటూ హరివంశ్ రాయ్ బచ్చన్ రాసిన కవితను షేర్ చేశారు.

1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరుంబుదూరులో పార్టీ తరఫున రాజీవ్ గాంధీ ప్రచారం చేస్తుండగా.. ఎల్‌టీటీఈ మహిళా సూసైడ్ బాంబర్ దాడి చేసింది. ఈ ఘటనలో ఆయన కన్నుమూశారు. అప్పటి నుంచి ఆయన వర్ధంతిని ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంగా పాటిస్తున్నారు.

More Telugu News