atm: రూ.2,000 నోట్ల డిపాజిట్ కోసం క్యూ కడుతున్న ప్రజలు

  • ఏటీఎం కేంద్రాల వద్ద డిపాజిట్ యంత్రాల్లో జమకు ఆసక్తి
  • బ్యాంకు శాఖల్లో డిపాజిట్ కోసం వస్తున్న ప్రజలు
  • సాధారణ రోజులతో పోలిస్తే పెరిగిన రద్దీ 
public marching towards  banks and ATMS to depost Rs 2000 notes

ఆర్ బీఐ రూ.2,000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించడంతో ప్రజలు ఈ నోట్లతో బ్యాంకులకు క్యూ కడుతున్నారు. సెప్టెంబర్ 30 వరకు ఈ నోట్లను మార్చుకునేందుకు ఆర్ బీఐ అవకాశం కల్పించింది. అప్పటి వరకు చలామణీ కూడా చేసుకోవచ్చు. లేదంటే బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేసుకోవచ్చు. డిపాజిట్ చేసుకోకుండా బ్యాంకులో మార్చుకోవడం అయితే రోజులో రూ.20వేల పరిమితి విధించారు. ఈ విషయం తెలిసిన ప్రజలు తమవద్దనున్న రూ.2,000 నోట్లను ఏటీఎం కేంద్రాల్లోని నగదు డిపాజిట్ యంత్రాల్లో జమ చేస్తున్నారు.


బ్యాంకు ఖాతాల్లోనూ జమ చేసుకునేందుకు వస్తున్నారు. సాధారణ రోజులతో పోలిస్తే నేడు బ్యాంకుల వద్ద, ఏటీఎం కేంద్రాల వద్ద రద్దీ కనిపిస్తోంది. నిజానికి రూ.2,000 నోట్లను చాలా నెలలుగా బ్యాంకులు ఏటీఎం యంత్రాల్లో ఉంచడం లేదు. దీంతో ఈ నోట్లు చాలా తక్కువ మంది వద్దే ఉన్నాయి. ఆర్ బీఐ తాజా నిర్ణయంతో మిగిలినవీ బ్యాంకులకు చేరనున్నాయి. ఈ పెద్ద నోటును ఉపసంహరించుకునే యోచన ముందు నుంచే ఉందనడానికి నిదర్శనంగా దీని ముద్రణను 2018లోనే నిలిపివేశారు. డిజిటల్ చెల్లింపులు గణనీయంగా పెరగడం, కరెన్సీ వినియోగం తగ్గడంతో పెద్ద నోట్లను తొలగించాలనే నిర్ణయాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. 

2016లో రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసిన సమయంలో రూ.2,000నోటును ప్రవేశపెట్టారు. వ్యవస్థలో 90 శాతం నగదు చట్టబద్ధమైన చెల్లుబాటును రద్దు చేయడంతో, కరెన్సీ కొరతను అధిగమించేందుకు ఆర్ బీఐ అప్పట్లో రూ.2,000ను ప్రవేశపెట్టింది. నాడు నోట్ల రద్దుతో ప్రజలు, చిన్న పరిశ్రమలు నానా ఇబ్బందులు పడ్డాయి. కానీ, నేడు కరెన్సీ వినియోగం పెద్దగా లేకపోవడం, కొంత కాలంగా రూ.2,000 నోట్లను పంపిణీ చేయడకపోవడం తదితర అంశాలతో ఈ విడత సామాన్యుడికి పెద్దగా అగచాట్లు ఉండకపోవచ్చు. బ్యాంకు శాఖల్లో ఈ నెల 23 నుంచే రూ.2,000 నోట్లను మార్చుకోవడానికి ఉంటుంది. 

More Telugu News