కేరళలో భార్యల మార్పిడి కేసు.. ఫిర్యాదు చేసిన మహిళ దారుణ హత్య
- కేరళలో సంచలనం సృష్టించిన భార్యల మార్పిడి కేసు
- పోలీసులకు ఫిర్యాదు చేసిన సూత్రధారి భార్య
- జనవరిలో 9 మంది నిందితుల అరెస్ట్
- భార్యను హత్య చేసి, భర్త ఆత్మహత్యకు యత్నం?
తన ఇంటి ముందు రక్తపు మడుగులో పడివున్న మహిళను చూసిన ఇరుగుపొరుగు వారు వెంటనే మెడికల్ కాలేజీకి తరలించారు. అయితే, అక్కడ చేరిన కాసేపటికే ఆమె ప్రాణాలు విడిచింది. భార్యల మార్పిడి ప్రధాన సూత్రధారి అయిన షినోనే తన కుమార్తెను హత్య చేసి ఉంటాడని బాధితురాలి తండ్రి ఆరోపించారు.
పోలీసుల కథనం ప్రకారం.. ‘కపుల్ మీట్స్ కేరళ’ అనే టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా భార్యల మార్పిడి జరుగుతోంది. ఈ గ్రూపులో ఉన్న 9 మందికి పైగా సభ్యులు తమ భార్యలను మార్చుకున్నారు. ఈ క్రమంలో షినో కూడా తన భార్యను బలవంతంగా వారి వద్దకు పంపారు. ఆమెపై వారంతా అత్యాచారానికి పాల్పడ్డారు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 9 మంది ముఠాను పోలీసులు జనవరిలోనే అరెస్ట్ చేశారు. ఈ ముఠా వెనక పెద్ద తలకాయలు ఉండి ఉండొచ్చని భావిస్తున్నారు. కాగా, ఇప్పుడు షినో భార్య హత్యకు గురికావడం ఈ కేసులో మరోమారు సంచలనమైంది.