పదో వసంతంలోకి తెలంగాణ.. ఘనంగా వేడుకలు: కేసీఆర్
- దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కేసీఆర్ ఆదేశం
- ప్రతి హృదయం ఉప్పొంగేలా పండుగ వాతావరణం కనిపించాలని సూచన
- అతిపిన్న వయస్సు గల రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకెళ్తోందన్న సీఎం
కేసీఆర్ అధ్యక్షతన సచివాలయంలో ఉత్సవాల నిర్వహణపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా దశాబ్ది ఉత్సవాల నిర్వహణ విధివిధానాలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సచివాలయంలో తొలి రోజు ఉత్సవాలు ప్రారంభమవుతాయని, అదే రోజు రాష్ట్ర మంత్రులు వారివారి జిల్లా కేంద్రాలలో ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేపడతారన్నారు.
2023 జూన్ నాటికి తెలంగాణ రాష్ట్రం సిద్ధించి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకొని, పదో వసంతంలోకి అడుగుపెడుతోందన్నారు. ఎన్నో పోరాటాల ఫలితమే తెలంగాణ రాష్ట్రమని చెప్పారు. అతి పిన్న వయస్సు గల రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకు వెళ్తోందన్నారు. దేశానికే తెలంగాణ రోల్ మోడల్ గా నిలిచిందన్నారు. ఉత్తరాది రాష్ట్రాలు మన అభివృద్ధి విని ఆశ్చర్యపోతున్నాయన్నారు. వ్యవసాయ రంగంపై కేంద్రానికి దూరదృష్టి కొరవడిందన్నారు.