Robber: జూబ్లీహిల్స్ లో గర్భిణిని బంధించి రూ.8 లక్షలతో ఉడాయించిన దొంగ

  • బెడ్ రూమ్ డోర్ లాక్ పెట్టకపోవడంతో ప్రవేశించిన దొంగ
  • కూతురు కోసం వచ్చిన తల్లికీ నిర్బంధం
  • నగదు తీసుకుని, ఓలా క్యాబ్ లో వెళ్లిపోయిన వైనం
Robber holds pregnant woman mom hostage scoots with Rs 8 lakh

ఇంటికి సరైన రక్షణ లేకపోతే ఏమవుతుందో ఈ ఘటన తెలియజేస్తోంది. ఇంట్లోకి చొరబడిన ఓ దొంగ ఇంటి వాళ్లను బంధించి రూ.8 లక్షలతో ఎంచక్కా క్యాబులో వెళ్లిపోయాడు. హైదరాబాదు జూబ్లీహిల్స్ పోలీసులు స్టేషన్ పరిధిలో ఈ నెల 3న ఈ దోపిడీ జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ఇలా ఉన్నాయి. 

జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 52లో వ్యాపారి ఎన్ఎస్ఎన్ రాజు ఇంట్లోకి తెల్లవారుజామున 3 గంటల సమయంలో దొంగ చొరబడ్డాడు. బెడ్ రూమ్ డోర్ తెరిచి ఉండడంతో లోపలికి ప్రవేశించాడు. గర్బిణి అయిన వ్యాపారి కుమార్తె నవ్య ఒంటరిగా నిద్రించింది. ఆమె మెడపై కత్తి పెట్టి అరిస్తే చంపేస్తానని బెదిరించి ఆమెను బందీ చేశాడు. ఉదయం 7 గంటల వరకు అదే గదిలో ఉండిపోయాడు. కుమార్తెను నిద్రలేపేందుకు తల్లి బెడ్ రూమ్ లోకి వచ్చింది. ఆమెను కూడా దొంగ బెదిరించి బందీ చేశాడు. అరిస్తే ఇంట్లో ఉన్న అందరినీ చంపేస్తానని బెదిరించాడు. వెంటనే తనకు రూ.20 లక్షలు ఇస్తే ఏమీ చేయకుండా వెళ్లిపోతానని చెప్పాడు.

వారు నగదు లేదు, బంగారం ఉందని చెప్పి ఇస్తానన్నా దొంగ వినలేదు. నగదే కావాలని కోరడంతో చివరికి నవ్య తన భర్తకు కాల్ చేసి అత్యవసరం ఉందంటూ రూ.10 లక్షలు పంపించాలని కోరింది. ఆమె భర్త ఓ స్నేహితుడి ద్వారా రూ.8 లక్షలు పంపించాడు. ఉదయం 10.20 గంటలకు రూ.8 లక్షలు తీసుకొచ్చి ఇవ్వడంతో నవ్య ఫోన్ నుంచి ఓలా క్యాబ్ బుక్ చేసుకుని దొంగ వెళ్లిపోయాడు. సంబంధిత వ్యక్తి షాద్ నగర్ లో దిగినట్టు పోలీసులు గుర్తించారు. అతడ్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను పోలీసులు రంగంలోకి దింపారు. నిచ్చెన ద్వారా రెండో అంతస్తుకు వచ్చి, అక్కడి నుంచి మొదటి అంతస్తుకు చేరుకున్నట్టు పోలీసులు సీసీటీవీ కెమెరా ఫుటేజీల సాయంతో తెలుసుకున్నారు. నవ్య బెడ్ రూమ్ డోర్ ఓపెన్ చేసి ఉంచడం వల్లే ఈ ఘటనకు తావిచ్చినట్టు తేల్చారు.

More Telugu News