సంక్షోభంలో గో ఫస్ట్ ఎయిర్ లైన్స్.. టికెట్ తీసుకున్న వారి పరిస్థితి ఏంటి?
- టెన్షన్ పడాల్సిన అవసరం లేదంటున్న కంపెనీ
- పూర్తి రిఫండ్ ఇస్తామని ప్రతినిధుల ప్రకటన
- మూడు రోజుల తర్వాత సర్వీసులు నడుస్తాయా? అన్న ఆందోళనలో ప్రయాణికులు
ఈ మూడు రోజులలో ప్రయాణించేందుకు టికెట్ బుక్ చేసుకున్న వారు ఆందోళన పడాల్సిన అవసరంలేదని గో ఫస్ట్ ఎయిర్ లైన్స్ ప్రతినిధులు వెల్లడించారు. టికెట్ డబ్బులు పూర్తి రిఫండ్ చేస్తామని, కంపెనీ వెబ్ సైట్ లో బుక్ చేసుకున్న కస్టమర్లకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమచేస్తామని తెలిపారు. ఇతరత్రా ఏజెన్సీల ద్వారా టికెట్ బుక్ చేసుకున్న వారు ఆయా ఏజెన్సీలను సంప్రదించాలని సూచించారు.
టికెట్ సొమ్ము వాపస్ ఇచ్చే విషయానికి సంబంధించిన విధివిధానాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. కాగా, మూడు రోజుల పాటు సర్వీసులు రద్దు చేసిన గో ఫస్ట్.. ఆ తర్వాతైనా సర్వీసులను పునరుద్ధరిస్తుందా లేదా అని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. చౌక ధరలో విమాన ప్రయాణాన్ని సామాన్యుడికి అందుబాటులోకి తెచ్చిన ఎయిర్ లైన్స్ కంపెనీ ఇలా ఆర్థిక కష్టాలలో చిక్కుకోవడంపై విచారం వ్యక్తం చేస్తున్నారు.