gst: జీఎస్టీ వసూళ్లలో సరికొత్త రికార్డ్... ఏపీ, తెలంగాణలలోను భారీ వృద్ధి

  • 2022 ఏప్రిల్‌తో పోలిస్తే ఈసారి 12 శాతం పెరిగి రూ.1.87 లక్షల కోట్లకు జంప్
  • ఏప్రిల్ 20న రూ.68,228 కోట్ల వసూళ్లతో ఒకరోజు అత్యధిక కలెక్షన్స్ రికార్డ్
  • ఏపీలో 6 శాతం, తెలంగాణలో 13 శాతం పెరుగుదల
GST Collection For April 2023 Is Highest Ever

ఏప్రిల్ 2023లో జీఎస్టీ వసూళ్లు సరికొత్త రికార్డును సృష్టించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా రూ.1.87 లక్షల కోట్లు వసూలైనట్లు ఈ రోజు ప్రభుత్వం వెల్లడించింది. గత ఏడాది ఏప్రిల్ (2022)తో పోలిస్తే ఈసారి జీఎస్టీ వసూళ్లు రూ.19,495 కోట్లు లేదా 12 శాతం అధికం. 

2022 ఏప్రిల్ నెలలో రూ.1.68 లక్షల కోట్లు వసూలయ్యాయి. గత నెలలో ఏప్రిల్ 20వ తేదీన ప్రభుత్వం అత్యధికంగా రూ.68,228 కోట్లు వసూలు చేసింది. ఇప్పటి వరకు ఒకరోజు అత్యధిక వసూళ్ల రికార్డ్ ఇదే.

జనవరి 2023 నుండి ప్రతి నెలా జీఎస్టీ వసూళ్లు 10 శాతానికి పైగా పెరిగినట్లు ప్రభుత్వ డేటా చూపుతోంది. దేశీయ లావాదేవీల ద్వారా (సేవల దిగుమతితో సహా) ఆదాయం గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఈ ఏప్రిల్ నెలలో 16 శాతం ఎక్కువగా ఉందని తెలిపింది. 

ప్రభుత్వం ప్రచురించిన డేటా ప్రకారం... సిక్కిం జీఎస్టీ ఆదాయ సేకరణ వృద్ధి 61 శాతం పెరిగింది. గత ఏడాది ఇదే నెలలో రూ.264 కోట్లు కాగా, ఈసారి రూ.426 కోట్లకు చేరుకొని, రాష్ట్రాలలో అత్యధిక పెరుగుదలగా నిలిచింది. సిక్కిం జీఎస్టీ రాబడి వృద్ధి శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ, గుజరాత్, హర్యానా వంటి పెద్ద రాష్ట్రాల కంటే తక్కువగా ఉంది.

తెలుగు రాష్ట్రాల జీఎస్టీ వసూళ్ల విషయానికి వస్తే గత ఏడాది ఏప్రిల్ నెలలో రూ.4,067 కోట్ల వసూళ్లు సాధించిన ఏపీ ఈసారి 6 శాతం పెరుగుదలతో రూ.4,329 కోట్లు నమోదు చేసింది. తెలంగాణ జీఎస్టీ వసూళ్లు రూ.4,955 కోట్ల నుండి 13 శాతం పెరిగి రూ.5,622 కోట్లుగా నమోదయ్యాయి.

More Telugu News