divorce: విడాకుల చట్టంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు

  • వివాహ బంధం విచ్ఛిన్నమైతే ఆరు నెలలు వేచి ఉండక్కర్లేదు
  • ఆర్టికల్ 142 కింద వారికి విడాకులు మంజూరు చేయవచ్చు
  • ప్రత్యేక కేసుల్లో నిబంధనను పక్కన పెట్టొచ్చన్న ధర్మాసనం
Can dissolve marriage on ground of irretrievable breakdown says Supreme Court

జీవిత భాగస్వాములు ఒకరిపై ఒకరు విశ్వాసం కోల్పోయి, కలసి ఉండలేని పరిస్థితుల్లో విడాకులు కావాలని కోరితే, చట్టం పరిధిలో విడాకులు పొందేందుకు ప్రస్తుతం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. వీటికి చరమగీతం పాడుతూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. తిరిగి కోలుకోలేని విధంగా వివాహ బంధం విచ్ఛిన్నం అయినప్పుడు ఆర్టికల్ 142 కింద దంపతులకు విడాకులు మంజూరు చేయవచ్చని, కనీసం ఆరు నెలలు వేచి ఉండాలన్న నిబంధన అలాంటి కేసుల్లో పక్కన పెట్టొచ్చని స్పష్టం చేసింది.

జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఏఎస్ ఓకా, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ జేకే మహేశ్వరి తదితరులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం దీనిపై సోమవారం తీర్పు వెలువరించింది. వివాహ బంధం తిరిగి పునరుద్ధరించలేని పరిస్థితులను కూడా తాము నిర్దేశించినట్టు రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. ముఖ్యంగా నిర్వహణ, భరణం, పిల్లల హక్కుల మధ్య ఎలా సమతుల్యం చేయాలన్నది కూడా స్పష్టం చేసింది. చట్టంలోని సెక్షన్ 13బీ పరస్పరం విడాకులు కోరుకునే కనీసం ఆరు నెలలు వేచి చూడాలని చెబుతోంది. 

రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద తనకున్న విస్తృతమైన అధికారాలను వినియోగించుకుని ఈ వేచి ఉండే నిబంధనను సుప్రీంకోర్టు కొన్ని షరతుల మేరకు రద్దు చేయవచ్చని ధర్మాసనం పేర్కొంది. ఆర్టికల్ 142ని ప్రాథమిక హక్కుల కోణంలో చూడాలని అభిప్రాయపడింది. ఆర్టికల్ 142 కింద సుప్రీంకోర్టు  విస్తృత అధికారాలను ఉపయోగించుకుని, విడాకుల కేసులను కుటుంబ కోర్టులకు బదిలీ చేయకుండానే, వివాహ బంధాన్ని రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లపై ధర్మాసనం ఈ మేరకు తీర్పు చెప్పింది. ముఖ్యంగా విడాకుల విషయంలో ఎంతో విలువైన కాలహరణం జరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు ఎంతో మంది బాధితులకు ఉపశమనం కల్పించనుంది.

More Telugu News