Rajinikanth: రజనీకాంత్‌పై వైసీపీ నీచపు వ్యాఖ్యలు.. జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: చంద్రబాబు

  • రజనీకాంత్‌పై వైసీపీ మూకల అసభ్యకర దాడి దారుణమన్న టీడీపీ అధినేత
  • వైసీపీ ప్రభుత్వాన్ని రజనీ ఒక్క మాట కూడా అనలేదన్న చంద్రబాబు
  • జగన్ క్షమాపణ చెప్పి తప్పును సరిదిద్దుకోవాలని సూచన
YS Jagan Should Say Sorry for his leaders comments on Rajinikanth

ఎన్టీఆర్ శతజయంతి కార్యక్రమానికి అతిథిగా వచ్చిన తమిళ సూపర్ స్టార్‌ రజనీకాంత్‌పై వైసీపీ నేతలు నీచపు వ్యాఖ్యలు చేశారని, అందుకు ముఖ్యమంత్రి జగన్ క్షమాపణ చెప్పాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. అన్నగారి శతజయంతి కార్యక్రమంలో పాల్గొని, ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్న రజనీకాంత్‌పై వైసీపీ మూకలు అసభ్యకరంగా విమర్శల దాడి చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో ఎంతో గౌరవం కలిగిన రజనీకాంత్ లాంటి పర్సనాలిటీపై వైసీపీ నేతలు చేస్తున్న నీచ వ్యాఖ్యలతో అందరూ బాధపడుతున్నారని అన్నారు.

వైసీపీ ప్రభుత్వంపై ఆయన చిన్న విమర్శ కూడా చేయలేదని, ఎవరినీ చిన్న మాట కూడా అనలేదని అన్నారు. పలు అంశాలపై ఆయన తన అభిప్రాయాలను మాత్రమే పంచుకున్నారని అన్నారు. అహంకారంతో ఆయనపై చేస్తున్న విమర్శలను తెలుగు ప్రజలు సహించబోరన్నారు. శిఖరం లాంటి వ్యక్తిత్వం కలిగిన రజనీకాంత్‌పై వైసీపీ నేతల విమర్శలు ఆకాశంపై ఉమ్మి వేయడమేనని అన్నారు. జగన్ తన నేతలను అదుపులో పెట్టుకోవాలని సూచించారు. జరిగిన దానికి క్షమాపణ చెప్పి తప్పును సరిదిద్దుకోవాలని చంద్రబాబు సూచించారు.

More Telugu News