నా దేశం కూడా నా మీద అంత పెట్టుబడి పెట్టదు: ఆండ్రూ రస్సెల్
- కోల్ కతా నైట్ రైడర్స్ అంటే తనకు ఎంతో ప్రత్యేకమన్న రస్సెల్
- తనను మోకాలి చికిత్స కోసం పంపించిందని వెల్లడి
- మరో ఫ్రాంచైజీ వైపు చూడనని స్పష్టీకరణ
రస్సెల్ ఫిట్ నెస్ సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ సీజన్ లో చివరి మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై పోరులోనే మొదటిసారి నాలుగు ఓవర్ల కోటాను అతడు పూర్తి చేశాడు. 29 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. చాలా ఏళ్లుగా రస్సెల్ కోల్ కతా జట్టుకు కీలక ఆటగాడిగా ఉంటూ వస్తున్నాడు. అందుకే అతడికి ఫ్రాంచైజీ రూ.16 కోట్ల భారీ పారితోషికాన్ని ఏడాదికి చెల్లిస్తోంది. గడిచిన కొంత కాలంగా అతడు మోకాలి నొప్పి సమస్యతో బాధపడుతుండగా, చికిత్స విషయంలో నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ తనకు ఎంతో సాయం చేసినట్టు చెప్పాడు.
‘‘కేకేఆర్ నన్ను సరైన మోకాలి చికిత్స కోసం పంపించి పరిస్థితులను సంతోషంగా మార్చింది. అది నాకు ఎంతో ప్రత్యేకం. నా పట్ల మరో ఫ్రాంచైజీ కానీ, కనీసం నా దేశం కూడా అంత పెట్టుబడి పెట్టలేదు. నేను ఇక్కడ ఉన్నందుకు సంతోషంగా ఉంది. నేను మరో ఫ్రాంచైజీ వైపు చూడను. నేను తొమ్మిదేళ్లుగా ఇక్కడ ఉన్నాను. ఈ టోర్నమెంట్ లో భాగం కావడానికి ఇష్టపడతాను. క్రికెట్ లేనప్పుడు నేను వెంకీ (మైసూర్)తో మాట్లాడుతూనే ఉంటాను. అతడ్ని ఎప్పుడూ గౌరవిస్తాను’’ అని రస్సెల్ పేర్కొన్నాడు. రస్సెల్ 2019లో మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు.