Jagan: మానవాళికి మంచిని బోధించే పండుగ... రంజాన్: సీఎం జగన్

  • రేపు (ఏప్రిల్ 22) రంజాన్ పండుగ
  • ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం
  • ముస్లిం సోదరుల ప్రార్థనలు సఫలం కావాలని ఆకాంక్ష
  • మనిషిలోని చెడును రూపుమాపే పండుగ అని వెల్లడి
CM Jagan wishes Muslims on Ramadan

రంజాన్ పండుగ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ ముస్లింలకు ఈద్ ముబారక్ తెలిపారు. మానవాళికి హితాన్ని బోధించే పండుగ రంజాన్ అని అభివర్ణించారు. సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక రంజాన్ అని వివరించారు. 

కఠోర ఉపవాస దీక్షలతో క్రమశిక్షణ... దానధర్మాలతో దాతృత్వం... సామూహిక ప్రార్థనలతో ధార్మిక చింతన, ఐకమత్యం... ఈ పండుగ మానవాళికి ఇచ్చే సందేశం అని సీఎం జగన్ పేర్కొన్నారు. పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్ ఒక ముగింపు వేడుక అని తెలిపారు. 

ముస్లిం సోదరులు చేసే ప్రార్థనలు సఫలం కావాలని, అల్లా దీవెనలతో రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. మనిషిలోని చెడు భావనలను, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్ అని వివరించారు.

More Telugu News