Andhra Pradesh: సీబీఐ విచారణకు హాజరైన ఎంపీ అవినాశ్ రెడ్డి

  • అనుచరులతో కలిసి కోఠిలోని సీబీఐ కార్యాలయానికి వచ్చిన ఎంపీ  
  • వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాశ్ 
  • ఈ నెల 25 వరకు అవినాశ్ ను అరెస్ట్ చేయవద్దని ఆదేశించిన తెలంగాణ హైకోర్టు
MP YS Avinash reddy appears before CBI

ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి సీబీఐ ఎదుట హాజరయ్యేందుకు బుధవారం హైదరాబాద్ వచ్చారు. కొద్దిసేపటి క్రితం ఆయన కోఠిలోని సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయనతో పాటు పెద్ద సంఖ్యలో అనుచరులు కూడా వచ్చారు. అయితే, అవినాశ్ రెడ్డి రెడ్డిని మాత్రమే లోపలికి అనుమతించిన సీబీఐ అధికారులు ఆయన అనుచరులను అనుమతించలేదు.  గేటు వద్దే వారి వాహనాలను నిలిపివేశారు. అవినాశ్ రెడ్డిని సీబీఐ దర్యాప్తు అధికారులు ప్రస్తుతం ప్రశ్నిస్తున్నారు.

కాగా, ఈ కేసులో  అవినాశ్‌ ను ఈనెల 25వ తేదీదాకా అరెస్టు చేయవద్దని మంగళవారం తెలంగాణ హైకోర్టు సీబీఐని ఆదేశించింది. అప్పటిదాకా ఆయన ప్రతి రోజూ సీబీఐ విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది. అవినాశ్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై ఈ నె 25వ తేదీన తీర్పు చెప్పనున్నట్లు ప్రకటించింది. సీబీఐ సమన్లు, కోర్టు ఆదేశాల మేరకు అవినాశ్ సీబీఐ కార్యాలయానికి వచ్చారు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో సీబీఐ అధికారులు తమ ప్రశ్నలను లిఖితపూర్వకంగా అవినాశ్ కు అందజేయనున్నారు. ఆయన ఇచ్చే సమాధానాలను ఆడియో, వీడియో రికార్డు చేసి, కోర్టుకు సమర్పించనున్నారు.

More Telugu News