Actor Madhavan: నటుడు మాధవన్ కుమారుడికి ఐదు బంగారు పతకాలు

  • మలేషియన్ ఇన్విటేషనల్ ఏజ్ గ్రూప్ ఛాంపియన్ షిప్‌లో సత్తా చాటిన వేదాంత్ మాధవన్
  • వేదాంత్ ఐదు బంగారు పతకాలు గెలుచుకున్నట్టు నటుడు మాధవన్ వెల్లడిః
  • ఎంతో సంతోషంగా ఉందని వ్యాఖ్య
actor madhavan elated as his son vedant wins 5 gold medals in malaysian swimming tournament

ప్రముఖ నటుడు మాధవన్ పుత్రోత్సాహం అంబరాన్ని అంటింది. స్విమ్మింగ్ కాంపిటిషన్‌లో తన కుమారుడు వేదాంత్ ఐదు బంగారు పతకాలను గెలుచుకున్న విషయాన్ని మాధవన్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘‘దేవుడి దయ, మీ అందరి ఆశీస్సులతో వేదాంత్ భారత్‌కు ఐదు బంగారు పతకాలు(50 మీటర్లు, 100, 200, 400, 1500 విభాగాల్లో) సాధించాడు. కౌలాలంపూర్‌లో జరిగిన మలేషియన్ ఇన్విటేషనల్ ఏజ్ గ్రూప్ ఛాంపియన్ షిప్‌లో ఈ పతకాలను గెలుచుకున్నాడు’’ అంటూ మాధవన్ ఇన్‌స్టా వేదికగా హర్షం వ్యక్తం చేశారు. దీంతో.. మాధవన్‌కు అభినందన సందేశాలు వెల్లువెత్తాయి. మిత్రులు, శ్రేయోభిలాషులు, సెలబ్రిటీలు మాధవన్‌కు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు. 

వేదాంత్ మాధవన్ గతంలోనూ పలు స్విమ్మింగ్ టోర్నమెంట్లలో తన సత్తా చాటుకున్నాడు. గత కొన్ని ఏళ్లుగా పలు ప్రఖ్యాత పోటీల్లో పతకాలు సాధించాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో టీం మహారాష్ట్ర తరపున ఖేలో ఇండియా 2023లో పాల్గొన్న వేదాంత్ ఐదు బంగారం, రెండు వెండి పతకాలను గెలుచుకున్నాడు. గతేడాది జరిగిన 48వ జూనియర్ నేషనల్ అక్వాటిక్ ఛాంపియన్‌షిప్స్‌లో మాధవన్ సరికొత్త రికార్డులను నెలకొల్పాడు. 1500 మీటర్ల ఫ్రీస్టైల్ స్విమ్మింగ్ పోటీల్లో విజేతగా నిలిచాడు.

More Telugu News