Nara Lokesh: దళితులకు సామాజిక న్యాయం టీడీపీతోనే సాధ్యం: నారా లోకేశ్

  • ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రవేశించిన లోకేశ్ యువగళం
  • డోన్ నియోజకవర్గంలో ఘనస్వాగతం
  • ఎస్సీలతో ముఖాముఖి సమావేశం
  • ఎస్సీల సామాజిక న్యాయానికి టీడీపీ కట్టుబడి ఉందన్న లోకేశ్
Lokesh says social justice for Dalits only with TDP

తాడిపత్రి నుంచి డోన్ నియోజకవర్గంలో ప్రవేశించిన నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు అపూర్వస్వాగతం పలికారు. లోకేశ్ కు మహిళలు నీరాజనాలు పట్టగా, యువకులు పూలవర్షం కురిపించి బాణసంచా కాలుస్తూ జేజేలు పలికారు. 

అంతకుముందు తాడిపత్రి నియోజకవర్గం చందన గ్రామంలో లోకేశ్ ని చూసేందుకు మహిళలు పెద్ద ఎత్తున రోడ్ల పైకి వచ్చారు. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని మహిళలు తెలిపారు. టీడీపీ ప్రభుత్వం వస్తే పన్నుల భారం, పెట్రోల్, డీజిల్ ధరలు, నిత్యావసర సరుకుల ధరలు తగ్గించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అన్నారు. 

సరిహద్దు గ్రామం దైవాలకుంట మహిళలు తాము ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను యువనేత దృష్టికి తెచ్చారు. కలెక్టర్ కు విన్నవించినా ఫలితం లేకపోయిందని వాపోయారు. తాము అధికారంలోకి వచ్చాక తాగునీటి సౌకర్యం కల్పిస్తానని చెప్పి లోకేశ్ ముందుకు సాగారు. డి. రంగాపురం వద్ద లోకేశ్ కి ఉమ్మడి కర్నూలు జిల్లా నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. జక్కసానికుంట్లలో ఎస్సీ సామాజికవర్గీయులతో యువనేత సమావేశమై వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. .

లోకేశ్ తో తాడిపత్రి కౌన్సిలర్ల భేటీ

రాయలచెరువు క్యాంప్ సైట్ లో తాడిపత్రి మున్సిపల్ కౌన్సిలర్లు లోకేశ్ తో భేటీ అయ్యారు. తాడిపత్రిలో అధికార పార్టీ, పోలీసుల ఆధ్వర్యంలో దౌర్జన్యాలు జరుగుతున్నాయంటూ  లోకేశ్ దృష్టికి తెచ్చారు. అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న తీరుని మహిళా కౌన్సిలర్లు యువనేతకు వివరించారు. డీఎస్పీ చైతన్య టీడీపీ నేతలు, కార్యకర్తలను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. 

ఈ సందర్భంగా లోకేశ్ స్పందిస్తూ, ఇక్కడ జరుగుతున్న అరాచకాలు అన్ని తనకు తెలుసని అన్నారు., ఎవరిని వదిలిపెట్టబోనని, కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధించిన వారు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చాక జ్యుడిషియల్ ఎంక్వయిరీ వేసి అధికారులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అందరూ ధైర్యంగా పోరాడుతున్నారంటూ కౌన్సిలర్లను అభినందించారు.

ఎస్సీల సామాజిక న్యాయానికి టీడీపీ కట్టుబడి ఉంది!

ఎస్సీల సామాజిక న్యాయానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని లోకేశ్ స్పష్టం చేశారు. డోన్ నియోజకవర్గం బక్కసానికుంటలో ఎస్సీ సామాజికవర్గ ప్రతినిధులతో ఆయన ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... 2001 లో రాష్ట్రపతి ఆర్డినెన్సు ద్వారా ఎస్సీ వర్గీకరణ చేసింది చంద్రబాబు అని వెల్లడించారు. దాని ద్వారా మాదిగ, ఉప కులాలకు 27 వేల ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. వేల మందికి మెడిసిన్, ఇంజనీరింగ్ సీట్లు వచ్చాయని వివరించారు.

అయితే, వైఎస్ వేయించిన కేసు కారణంగా వర్గీకరణ ఆగిపోయిందని లోకేశ్ వెల్లడించారు. ఆ తరువాత జరిగిన నాటకం, జగన్ పాలనలో జరుగుతున్న నాటకం మీరు చూస్తున్నారు అని తెలిపారు. 

"చంద్రబాబు ఇచ్చిన జీఓ 25 ఆధారంగానే జగన్ మూడు కార్పొరేషన్లు తీసుకొచ్చారు. మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. కానీ ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఒక్కరికి రుణం ఇవ్వలేదు. టీడీపీ సామాజిక న్యాయం కోసం కట్టుబడి ఉంది. దళితుల్లో ఉన్న 62 ఉపకులాలకు న్యాయం చేస్తాం" అని భరోసా ఇచ్చారు.

ఎస్సీ సోదరుల కోసం స్టేషన్ కు వెళ్లా!

తన జీవితంలో మొదటిసారిగా పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది ఒక దళిత యువతి కుటుంబానికి న్యాయం చెయ్యమని పోరాటం చేసినందుకేనని లోకేశ్ వెల్లడించారు. "గుంటూరులో రమ్య అనే దళిత యువతిని ఒక మృగాడు నడి రోడ్డు మీద హత్య చేశాడు. ఆ కుటుంబానికి న్యాయం చెయ్యమని అడిగినందుకు నన్ను స్టేషన్ కి తీసుకెళ్లారు. రమ్య కుటుంబానికి రూ.5 లక్షలు సాయం చేసాం. న్యాయ పోరాటానికి కూడా సాయం చేసాం. అమరావతి దళిత రైతుల కోసం పోరాడినందుకు రెండోసారి స్టేషన్ కి వెళ్ళాను" అని వివరించారు.

*యువగళం పాదయాత్ర వివరాలు:*

*ఇప్పటి వరకు నడిచిన దూరం 889.7 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 15.6 కి.మీ.*

*70వరోజు (14-4-2023) యువగళం వివరాలు:*

*డోన్ అసెంబ్లీ నియోజకవర్గం (నంద్యాలజిల్లా):*

ఉదయం

7.00 – గుడిపాడు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

7.10 – గుడిపాడులో స్థానికులతో మాటామంతీ.

8.30 – హెచ్ఆర్ పల్లిలో యాదవులతో సమావేశం.

9.25 – పూదొడ్డి, మందొడ్డి క్రాస్ వద్ద మామిడిరైతులతో భేటీ.

11.00 – ప్యాపిలి శివార్లలో భోజన విరామం.

సాయంత్రం

4.00 – ప్యాపిలి శివార్ల పాదయాత్ర కొనసాగింపు.

4.45 – ప్యాపిలి నీలకంఠేశ్వరస్వామి గుడివద్ద స్థానికులతో సమావేశం.

4.55 – ప్యాపిలి బీసీ కాలనీలో 900 కి.మీ. మైలురాయి చేరిక, శిలాఫలకం ఆవిష్కరణ.

5.30 – ప్యాపిలిలో బహిరంగసభ. యువనేత నారా లోకేశ్ ప్రసంగం.

7.30 – పొలిమేరమెట్ట విడిది కేంద్రంలో బస.

More Telugu News