Rahul Gandhi: రాహుల్ గాంధీపై బీహార్‌లోనూ పరువునష్టం కేసు!

  • రాహుల్‌పై పరువు నష్టం దావా వేసిన బీజేపీ నేత సుశీల్ కుమార్ మోదీ
  • విచారణకు హాజరు కావాలంటూ పాట్నా కోర్టు సమన్లు
  • సూరత్ కోర్టు తీర్పుపై పై కోర్టుకు రాహుల్.. నేడు విచారణ
Patna Court Summons Rahul Gandhi

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మరిన్ని ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. మోదీ ఇంటి పేరుపై ఆయన చేసిన వ్యాఖ్యలకు గాను తాజాగా బీహార్‌లోనూ పరువునష్టం కేసు నమోదైంది. ఈ కేసులో ఈ నెల 25న విచారణకు హాజరు కావాలంటూ పాట్నా కోర్టు రాహుల్‌కు సమన్లు జారీ చేసింది. బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుశీల్ కుమార్ మోదీ.. రాహుల్ గాంధీపై పరువు నష్టం దావా వేయగా, దీనిపై పాట్నా ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు ఈ నెల 12న విచారణకు రావాలని రాహుల్‌ను ఆదేశించింది.

అయితే, ఇలాంటి కేసులోనే సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీలు విషయంలో తాము బిజీగా ఉన్నామని, కాబట్టి విచారణ వాయిదా వేయాలని రాహుల్ న్యాయవాదులు కోర్టును కోరారు. దీంతో విచారణను ఏప్రిల్ 25కు వాయిదా వేస్తూ ఆ రోజున రాహుల్ వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.

2019 ఎన్నికల సమయంలో కర్ణాటకలోని కోలార్‌లో రాహుల్ ప్రసంగిస్తూ.. ఆర్థిక నేరాలకు పాల్పడి దేశం విడిచి పారిపోయిన లలిత్ మోదీ, నీరవ్ మోదీల ఇంటి పేరును ప్రస్తావించారు. రాహుల్ చేసిన ‘మోదీ’ ఇంటి పేరు వ్యాఖ్యలపై సూరత్‌లో ఆయనపై పరువు నష్టం దావా దాఖలైంది. ఈ కేసులో కోర్టు ఇటీవల రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో ఆయన లోక్‌సభ సభ్యత్వం రద్దయింది. సూరత్ కోర్టు తీర్పుపై రాహుల్ పై కోర్టులో అప్పీలు చేసుకున్నారు. ఈ పిటిషన్‌పై నేడు విచారణ జరగనుంది.

More Telugu News