IPL: మూడో పోరులోనైనా సన్ రైజర్స్ బోణీ చేస్తుందా?

  • ఉప్పల్‌లో నేడు పంజాబ్‌తో కింగ్స్తో మ్యాచ్‌
  • తొలి రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయిన హైదరాబాద్
  • హ్యాట్రిక్ విజయంపై గురి పెట్టిన పంజాబ్ కింగ్స్
Sunrisers Hyderabad look to bounce back against Punjab Kings on home turf

ఐపీఎల్‌ 16లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నిరాశ జనక ప్రదర్శన చేస్తోంది. గత రెండు సీజన్లలో చివరి స్థానాలతో సరిపెట్టిన రైజర్స్ తాజా ఎడిషన్ లోనూ వరుసగా రెండు ఓటములతో డీలా పడింది. రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో పరాజయంతో అభిమానులను నిరాశ పరిచింది. ఇప్పుడు  సొంతగడ్డపై మరో మ్యాచ్‌కు రెడీ అయింది. ఉప్పల్‌ స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగే మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌తో తలపడనుంది. మూడో పోరులో అయినా గెలుపు బాట పట్టాలని ఆశిస్తోంది. అది జరగాలంటే ముందుగా రైజర్స్‌ బ్యాటింగ్‌ విభాగం మెరుగవ్వాల్సి ఉంది. గత రెండు మ్యాచ్‌ల్లోనూ హైదరాబాద్‌ బ్యాటర్లు తీవ్రంగా నిరాశ పరిచారు. ముఖ్యంగా టాపార్డర్‌ తడబడుతోంది. 

బ్యాటర్లు ఆరంభ ఓవర్లలోనే పెవిలియన్‌ చేరడం కలవరపెడుతోంది. గత పోరులో డకౌటైన కెప్టెన్‌ ఐడెన్‌ మార్‌క్రమ్‌ తాజా పోరులో అయినా  జట్టును ముందుండి నడిపించాలి. భారీ అంచనాలున్న బ్రూక్‌ తడబడుతున్న నేపథ్యంలో దక్షిణాఫ్రికాకు చెందిన హిట్టర్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌ను తుది జట్టులోకి తీసుకుంటారేమో చూడాలి. మరోవైపు ఆడిన రెండు మ్యాచ్‌లు నెగ్గి జోరుమీదున్న పంజాబ్‌ కింగ్స్‌ హ్యాట్రిక్‌ విజయంపై గురి పెట్టింది. ఆ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ లో బలంగా ఉంది. ఈ నేపథ్యంలో పంజాబ్ ను ఓడించాలంటే అన్ని విభాగాల్లోనూ సత్తా చాటాల్సి ఉంటుంది. ముచ్చటగా మూడో పోరులో అయినా సన్ రైజర్స్ బోణీ చేస్తుందో లేదో చూడాలి.

More Telugu News