Vijay Shekhar Sharma: పేటీఎం సౌండ్ బాక్స్ కు ప్రముఖుల అభినందనలు

  • కాపీ పేస్ట్ నమూనాలు ఇక్కడ పనిచేయవన్న నితిన్ కామత్
  • భారతీయ అవసరాల కోసమే రూపొందించిన ఉత్పత్తిగా అభివర్ణన 
  • తమ ఆవిష్కరణల పట్ల గర్విస్తున్నామన్న విజయ్ శేఖర్ శర్మ
Zerodha founder goes ga ga over Paytms soundbox Vijay Shekhar Sharma responds

పేటీఎం సౌండ్ బాక్స్ గురించి వినే ఉంటారు. పేటీఎం సౌండ్ బాక్స్ అనేది యూపీఐ ద్వారా కస్టమర్ చెల్లించిన మొత్తాన్ని వాయిస్ రూపంలో బయటకు వినిపిస్తుంది. యూపీఐ వచ్చిన తొలినాళ్లలో కస్టమర్ యూపీఐ ద్వారా మనీ పంపించినప్పుడు.. వర్తకుడు తన ఫోన్ లో ఆ పేమెంట్ వచ్చిందా, లేదా అని మెస్సేజ్ చూసి తెలుసుకోవాల్సి వచ్చేది. లేదంటే యూపీఐ యాప్ తెరిచి చెక్ చేసుకోవాల్సి వచ్చేది. కానీ పేటీఎం సౌండ్ బాక్స్ వర్తకుల పనిని చాలా సులభతరం చేసింది. పేమెంట్ వచ్చిన వెంటనే ఎంతన్నది వాయిస్ రూపంలో చెబుతుంది కనుక.. బిజీగా ఉండే వర్తకులు ఫోన్ ను చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. 

పేటీఎం సౌండ్ బాక్స్ ఆవిష్కరణను, అది తీసుకొచ్చిన సౌకర్యాన్ని జెరోదా వ్యవస్థాపకుడు, సీఈవో నితిన్ కామత్ తోపాటు పలువురు ప్రముఖులు ట్విట్టర్ పై అభినందించారు. ‘‘భారత్ ఎంతో వినూత్నమైనది. అమెరికా, ఇతర దేశాల నుంచి కాపీ పేస్ట్ మాదిరి నమూనాలు మన దగ్గర పెద్దగా పనిచేయవు. పేమెంట్స్ గురించి చదివి వినిపించే పేటీఎం స్పీకర్ అనేది పూర్తిగా భారత్ అవసరాల కోసం, భారతీయ ఫిన్ టెక్ సంస్థ రూపొందించిన ఉత్పత్తి’’ అని నితిన్ కామత్ ట్వీట్ రూపంలో పేర్కొన్నారు. పేటీఎం సౌండ్ బాక్స్ భారతీయ వర్తకుల జీవితాల్లో మార్పులు తెచ్చిందన్నారు. 

దీనికి పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ ధన్యవాదాలు తెలియజేస్తూ.. పేటీఎం దేశంలోనే మొదటిసారి క్యూఆర్ ఆధారిత చెల్లింపుల విధానాన్ని ఆవిష్కరించిందని, ఆ తర్వాత చెల్లింపులను ధ్రువీకరించే సౌండ్ బాక్స్ ను తీసుకొచ్చినట్టు గుర్తు చేశారు. పేటీఎం అగ్రగామి సాంకేతిక బృందం రూపొందించిన ఉత్పత్తులను నేడు విరివిగా వాడుతుండడం పట్ల గర్విస్తున్నామంటూ ట్వీట్ చేశారు. కస్టమర్ ను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి చేసిన ఉత్పత్తికి పేటీఎం సౌండ్ బాక్స్ మంచి ఉదాహరణగా నవమ్ క్యాపిటల్ ఎండీ రాజీవ్ మంత్రి సైతం పేర్కొన్నారు.

More Telugu News