nikhat zareen: ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్‌ కు ఘన స్వాగతం

  • ఈ ఉదయం హైదరాబాద్ కు తిరిగొచ్చిన నిఖత్
  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలికిన రాష్ట్ర క్రీడా శాఖ
  • ఊరేగింపులో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్, క్రీడా శాఖ అధికారులు
Nikhat zareen gets grand wellcome at shahmshabad airport

వరుసగా రెండోసారి మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ గా నిలిచిన తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ శనివారం ఉదయం హైదరాబాద్ కు తిరిగొచ్చింది. శంషాబాద్ విమానాశ్రయంలో నిఖత్ కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో క్రీడా శాఖ అధికారులు ఎయిర్ పోర్టులో ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఎయిర్ పోర్టులో దిగిన వెంటనే ఓపెన్ టాప్ జీప్ లో త్రివర్ణ పతాకాలతో నిఖత్ ను ఊరేగింపుగా తీసుకొచ్చారు. తన పతకం, ట్రోఫీని చూపిస్తూ నిఖత్ ముందుకు సాగింది.

ఈ కార్యక్రమంలో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ ఈ.ఆంజనేయ గౌడ్, రాష్ట్ర ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు వేణు గోపాల చారి, రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు చాముండేశ్వరి నాథ్, రాష్ట్ర క్రీడ ప్రాధికార సంస్థ ఉన్నతాధికారులు, వివిధ క్రీడా అసోసియేషన్ ప్రతినిధులు, నిఖత్ కుటుంబ సభ్యులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

ఢిల్లీ వేదికగా గత ఆదివారం ముగిసిన ప్రపంచ బాక్సింగ్ టోర్నమెంట్ లో నిఖత్ 50 కిలోల విభాగంలో వరుసగా రెండోసారి బంగారు పతకం గెలిచిన సంగతి తెలిసిందే. దిగ్గజ బాక్సర్ ఎంసీ మేరీకోమ్ తర్వాత ఈ ఘనత సాధించిన భారత క్రీడాకారిణిగా నిఖత్ జరీన్ నిలిచింది.

More Telugu News