నిజామాబాద్ రోడ్లపై పసుపు బోర్డులు.. మా ఎంపీ గారు తెచ్చిన ‘బోర్డు’ ఇదేనంటూ సెటైర్లు!

flexis in nizamabad against bjp mp dharmapuri arvind
  • నిజామాబాద్ లో ధర్మపురి అర్వింద్‌కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు, బోర్డులు
  • పసుపు బోర్డు తెస్తానన్న హామీని గుర్తు చేస్తూ ఏర్పాటు
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఫొటోలు
తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఫ్లెక్సీల వార్ ముదురుతోంది. రెండు మూడు నెలలుగా హైదరాబాద్ లో రాత్రికి రాత్రి పోస్టర్లు, ఫ్లెక్సీలు, హోర్డింగ్ లు వెలుస్తున్నాయి. ఇప్పుడు ఇవి తెలంగాణలోని జిల్లాలకు కూడా పాకాయి. 

నిజామాబాద్ లో పసుపు పండించే రైతులు ఎక్కువ. కానీ ఏటా మద్దతు ధర రాక నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ కు పసుపు బోర్డును తీసుకొస్తానని గత పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ నేత ధర్మపురి అర్వింద్ హామీ ఇచ్చారు. బాండ్ పేపర్ కూడా రాసిచ్చారు. ఆయన గెలుపులో ఈ హామీ కీలక పాత్ర పోషించింది. అయితే నాలుగేళ్లు పూర్తయినా పసుపు బోర్డు రాలేదు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ సిటీలో పోస్టర్లు వెలిశాయి.  

‘‘పసుపు బోర్డు... ఇది మా ఎంపీగారు తెచ్చిన పసుపు బోర్డు’’ అంటూ కాస్త వెటకారాన్ని యాడ్ చేసి నిజామాబాద్ అంతటా ఫ్లెక్సీలను అంటించారు. ఈ బోర్డులను పసుపులో పెట్టి.. అసలైన బోర్డును తీసుకురాలేదంటూ నిలదీశారు. అయితే ఈ బోర్డులపై ఎక్కడా ఊరూపేరు లేకపోవడం గమనార్హం. ఎవరు ముద్రించారనే వివరాలేవీ పేర్కొనలేదు. ప్రస్తుతం ‘పసుపు బోర్డు’ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Go Back to Shorts
dharmapuri arvind
flexis in nizamabad
pasupu board
BJP
BRS

More Telugu News