Telugudesam: నేడు టీడీపీ 41వ ఆవిర్భావ దినోత్సవం.. హైదరాబాద్ లో భారీ సభ.. చంద్రబాబు శుభాకాంక్షలు

  • తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఆవిర్భవించిన తెలుగుదేశం
  • 41 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో విజయాలు
  • ఎన్టీఆర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితమవుదామన్న చంద్రబాబు
Chandrababu greetings on TDP 41st formation day

తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడమే లక్ష్యంగా ఏర్పడిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం నేడు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆత్మగౌరవ నినాదంతో పుట్టి, తెలుగు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగు జాతికి శుభాకాంక్షలు అని ఆయన ట్వీట్ చేశారు. అన్న ఎన్టీఆర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితమవ్వాలని కోరుకుంటున్నానని చెప్పారు. జై తెలుగుదేశం... జోహార్ ఎన్టీఆర్ అని అన్నారు. 

మరోవైపు తెలుగుదేశం పార్టీ కూడా ట్విట్టర్ ద్వారా తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపింది. 'ప్రతీ అడుగూ ప్రజల కోసం.. ఈ 41 సంవత్సరాల ప్రస్థానం.. ప్రగతి కోసం మన తెలుగుదేశం.. ఇది తెలుగు వారి ఆత్మగౌరవం.. తెలుగు ప్రజలందరికీ టీడీపీ 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కృతజ్ఞతాభివందనాలు.. జెండా మోసిన ప్రతి కార్యకర్తకు, పార్టీ కోసం ప్రాణ త్యాగాలు చేసిన కార్యకర్తల, నాయకుల కుటుంబాలకు పాదాభివందనాలు.. సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్ళు.. జై తెలుగుదేశం.. జోహార్ ఎన్టీఆర్' అని ట్వీట్ చేసింది. 

మరోవైపు టీడీపీ 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఈరోజు భారీ బహిరంగసభను నిర్వహిస్తున్నారు. ఈ సభకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా అండమాన్ నుంచి కూడా పార్టీ ప్రతినిధులు హాజరుకానున్నారు. మొత్తం 15 వేల మంది హాజరుకానున్నట్టు పార్టీ వర్గాలు తెలియజేశాయి. సభకు విచ్చేస్తున్న పార్టీ శ్రేణుల కోసం భారీ ఏర్పాట్లు చేశారు.

More Telugu News