మహాత్మాగాంధీ మనవరాలు ఉషా గోకాని కన్నుమూత

  • ఐదేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఉషా గోకాని
  • రెండేళ్లుగా మంచానికే పరిమితం
  • గాంధీ స్థాపించిన సేవాగ్రామ్‌లోనే గడిచిన ఉష బాల్యం
  • మణి భవన్‌తో గాంధీకి జీవితకాల అనుబంధం
మహాత్మాగాంధీ మనవరాలు ఉషా గోకాని కన్నుమూశారు. ఆమె వయసు 89 సంవత్సరాలు. ముంబైలో ఆమె నిన్న తుదిశ్వాస విడిచారు. ఉష గత ఐదేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతుండగా, రెండేళ్లుగా మంచానికే పరిమితమయ్యారు. మహారాష్ట్రలోని వార్దాలో గాంధీ స్థాపించిన సేవాగ్రామ్ ఆశ్రమంలోనే ఉష బాల్యం గడిచింది. ముంబై మణి భవన్‌లోని గాంధీ స్మారక్ నిధికి ఉష చైర్ పర్సన్‌గానూ పనిచేశారు. 

భారత స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో మణి భవన్‌కు ఎంతో ప్రాముఖ్యం ఉండేది. మహాత్మాగాంధీ 1917-1934 మధ్య తరచూ మణి భవన్‌లోనే బస చేసేవారు. స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలకు అక్కడే నాంది పడింది. ఇందులో రెండు సంస్థలు ఉన్నాయి. ఒకటి గాంధీ స్మారక్ నిధి కాగా, మరోటి మణి భవన్ గాంధీ సంగ్రహాలయ. మణిభవన్‌తో గాంధీకి జీవితకాలంపాటు అనుబంధం ఉంది. 2 అక్టోబరు 1955లో మణి భవన్‌ను గాంధీ మెమోరియల్ సొసైటీకి అప్పగించారు.

Mahatma Gandhi
Usha Gokani
Mani Bhavan

More Telugu News