TSPSC: పేపర్ లీకేజ్ కేసు విచారణ రేపటికి వాయిదా

  • వాదనలు వినిపించనున్న వివేక్ ధన్కా
  • హైకోర్టులో నిరుద్యోగుల పిటిషన్
  • నిందితుల సిట్ విచారణ పూర్తి.. కీలక సమాచారం వెల్లడి
High Court adjourned TSPSC paper leakage case till tomorrow

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) పేపర్ లీకేజ్ కేసును హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. కోర్టుకు హాజరైన బల్మూరి వెంకట్ తరఫు న్యాయవాది కరుణాకర్ ఈ కేసు విచారణను వాయిదా వేయాలని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. దీంతో కేసు విచారణను మంగళవారానికి కోర్టు వాయిదా వేసింది. సుప్రీం కోర్టు న్యాయవాది, కాంగ్రెస్ లీగల్ సెల్ అధ్యక్షుడు వివేక్ ధన్కా ఈ కేసులో వాదనలు వినిపిస్తారని న్యాయవాది కరుణాకర్ తెలిపారు. మరోవైపు ఇదే కేసుకు సంబంధించి నిరుద్యోగులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో పిటిషన్ల విచారణను ధర్మాసనం రేపటికి వాయిదా వేసింది.

తెలంగాణలో సంచలనం రేపిన టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో సిట్ విచారణ ఆదివారంతో ముగిసింది. రెండు రోజుల పాటు హిమాయత్‌నగర్ కార్యాలయంలో జరిగిన విచారణలో సిట్ అధికారులు నిందితుల నుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు. ఐపీ అడ్రస్ లు మార్చేసి, కంప్యూటర్ లోకి లాగిన్ అయి క్వశ్చన్ పేపర్స్ దొంగిలించినట్లు నిందితుడు రాజశేఖర్ విచారణలో అంగీకరించినట్లు సమాచారం.

More Telugu News