వరుసగా రెండు గోల్డెన్ డక్ లు.. సూర్యను ఆడనిస్తారా?.. రోహిత్ స్పందన ఇదే!

  • జట్టు మేనేజ్‌మెంట్ సూర్యకు మరిన్ని అవకాశాలు ఇస్తుందన్న రోహిత్ శర్మ
  • బాగా ఆడాలన్న విషయం అతడికి తెలుసని వ్యాఖ్య
  • శ్రేయస్ అయ్యర్ స్థానంలో సూర్యను ఆడనిస్తున్నట్లు వెల్లడి
టీ20ల్లో పరుగుల వరద పారించాడు సూర్య కుమార్ యాదవ్. భారీ స్కోర్లతో టీమిండియాకు ఒంటిచేత్తో విజయాలను అందించాడు. కానీ కొన్ని రోజులుగా పరుగులు చేయడంలో తడబడుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్ లో ఘోరంగా విఫలమవుతున్నాడు.

తొలి రెండు వన్డేల్లో ఒకే బౌలర్ కు ఒకే రీతిలో తొలి బంతికే ఔట్ అయ్యాడు. వరుసగా రెండు సార్లు గోల్డెన్ డక్ కావడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మూడో వన్డేలో కొనసాగిస్తారా? లేదా? అనే దానిపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. 

బాగా ఆడాలన్న విషయం సూర్యకు తెలుసని, జట్టు మేనేజ్‌మెంట్ అతనికి మరిన్ని అవకాశాలు ఇస్తుందని చెప్పాడు. ‘‘శ్రేయస్ అయ్యర్ తిరిగి టీమ్ తో ఎప్పుడు చేరుతాడో తెలియదు. ఇప్పుడు అతడి ప్లేస్ ఖాళీగా ఉంది. అందుకే సూర్యను ఆడనిస్తున్నాం. వైట్ బాల్ క్రికెట్ లో అతడు బాగా ఆడాడు. అలా ఆడే వాళ్లకు అవకాశాలు ఇస్తామని నేను గతంలోనే చెప్పాను’’ అని వివరించాడు.

సూర్యకుమార్‌కు స్థిరంగా అవకాశాలు ఇస్తే.. అతడు కూడా ఈ ఫార్మాట్‌తో కంఫర్టబుల్ గా ఉంటాడని తెలిపాడు. ఎవరో గాయపడటం, లేదా అందుబాటులో లేకపోవడం వల్ల.. ఆ స్థానంలో సూర్య ఆడుతున్నాడని చెప్పాడు. ఒకవేళ మరిన్ని అవకాశాల తర్వాత కూడా అతడు పరుగులు చేయలేకపోతే.. అప్పుడు ఆలోచిస్తామని వివరించాడు. ప్రస్తుతానికి అలాంటి ఆలోచనలేమీ లేవని స్పష్టంచేశాడు.

ఇక ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బూమ్రా గౌర్హాజరీపైనా రోహిత్ స్పందించాడు. ‘‘బుమ్రా ఎనిమిది నెలలుగా జట్టులో లేడు. బుమ్రా చోటును భర్తీ చేయడం చాలా కష్టం. అతను నాణ్యమైన బౌలర్ అని మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు అతడు మనకు అందుబాటులో లేడు. దాని గురించి ఆలోచిస్తూనే ఉండబోం’’ అని వివరించాడు. మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్, ఉమ్రాన్ మాలిక్, జయదేవ్ ఉనాద్కట్ లాంటి వాళ్లు ఉన్నారని చెప్పాడు.


More Telugu News

Surya kumar Yadav Rohit Sharma 2 Ducks In 2 ODIs SKY Team India Australia