K Kavitha: ఉదయం అల్పాహార విందు ఇచ్చిన కవిత.. చెల్లెలు కోసం ఢిల్లీకి వెళ్లిన కేటీఆర్

లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈరోజు ఈడీ విచారణను ఎదుర్కొంటున్న నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఉదయం 11 గంటలకు ఆమె ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఈడీ కార్యాలయం వద్ద కేంద్ర బలగాలతో భద్రతను పెంచడమే కాక... 144 సెక్షను విధించారు. పరిసర ప్రాంతాల్లో బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. తన లాయర్ తో కలిసి కవిత విచారణకు హాజరుకానున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, లిక్కర్ వ్యాపారి రామచంద్రపిళ్లైతో కలిపి ఆమెను ఈడీ అధికారులు విచారించనున్నట్టు సమాచారం. 

ఇంకోవైపు, ఢిల్లీ తుగ్లక్ రోడ్ లోని కేసీఆర్ నివాసంలో కవిత బస చేశారు. ఈ ఉదయం 7.30 గంటలకు జాగృతి కార్యకర్తలకు ఆమె అల్పాహార విందు ఇచ్చారు. మరోవైపు తన చెల్లెలికి తోడుగా ఉండేందుకు కేటీఆర్ కూడా ఢిల్లీకి వెళ్లారు. రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే ఉండనున్నారు. కవితకు మద్దతుగా మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. విచారణ అనంతరం కవితను అరెస్ట్ చేస్తారా? అనే చర్చ కూడా పెద్ద ఎత్తున సాగుతోంది. కవిత కోసం ఈడీ అధికారులు 26 ప్రశ్నలను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.
K Kavitha
KTR
KCR
BRS
Delhi Liquor Scam
Enforcement Directorate

More Telugu News