Nara Lokesh: ​​లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే సోదరుడు

  • మదనపల్లి నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర
  • టీడీపీ తీర్థం పుచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా
  • సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన లోకేశ్
  • టీడీపీ గెలుపు కోసం కృషి చేయాలని సూచన
Former MLA Shazahan Basha joins TDP in the presence of Nara Lokesh

పోరాటాల పురిటిగడ్డ మదనపల్లిలో టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు జనం భారీగా తరలి వచ్చారు. యువగళం పాదయాత్ర 40వ రోజు మదనపల్లి శివారు దేవతానగర్ నుంచి ప్రారంభమై పట్టణ వీధుల గుండా సాగింది. మదనపల్లిలో బహిరంగసభ అనంతరం మదనపల్లి వైసీపీ ఎమ్మెల్యే నవాజ్ బాషా సోదరుడు, మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా టీడీపీలో చేరారు. లోకేశ్ బహిరంగ సభ వేదికపైనే ఆయనకు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. స్థానిక ఇన్చార్జి దొమ్మాలపాటి రమేశ్ తో కలసి పార్టీ గెలుపు కోసం పనిచేయాలని ఈ సందర్భంగా కోరారు. 

అడుగడుగునా దోపిడీ పర్వమే!

వైసీపీ ఎమ్మెల్యే నవాజ్ బాషా, అనుచరులు కలసి ప్రభుత్వానికి చెందిన 40 ఎకరాల్లో లేఅవుట్లు వేసి రూ.100 కోట్లు దోచుకున్నారని లోకేశ్ ఆరోపించారు. మదనపల్లిలో లే అవుట్ వేయాలంటే కప్పం కట్టాలని, 557 ఎకరాలు ఉన్న సీటీఎం చెరువును స్థానిక ఎమ్మెల్యే, తంబళ్లపల్లి ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి అనుచరులు 40 ఎకరాలు కాజేశారని వివరించారు. కరోనా వస్తే షాపులు, రెస్టారెంట్లు, బంగారం కొట్ల నుండి రూ.4 కోట్లు వసూలు చేశారని వెల్లడించారు. 

మదనపల్లికి నలుగురు ఎమ్మెల్యేలు!

మదనపల్లికి మొత్తం నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారని లోకేశ్ విమర్శించారు. అధికారిక ఎమ్మెల్యే నవాజ్ బాషా అయితే అనధికార ఎమ్మెల్యేలు పాపాల పెద్దిరెడ్డి, తంబళ్లపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి అని వివరించారు. 

"ఎమ్మెల్యే నవాజ్ బాషా తన బినామీలతో బెంగళూరు బస్టాండ్ పరిధిలోని షాపింగ్ కాంప్లెక్స్ నుండి నెలకు ఐదు లక్షలు వసూలు చేస్తున్నాడు. మదనపల్లి పట్టణంలో నవాజ్ బాషా తన అనుచరులతో వెంచర్లు వేస్తున్నాడు. ప్రభుత్వ భూమి పక్కనే ఉండేలా ప్రేవేటు స్థలాల్లో వెంచర్లు వేస్తూ ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తున్నాడు. పెద్దిరెడ్డికి 50 శాతం కమిషన్ ఇవ్వాలి. 2024 నాటికి దొరికిన భూమి, కొండలు, చెరువులు కూడా స్వాహా చేస్తారు" అని వ్యాఖ్యానించారు.

ఎంపీ మిథున్ రెడ్డికి లోకేశ్ సవాల్

రేపు తంబళ్లపల్లి నియోకవర్గంలో ఉంటానని, చిత్తూరు జిల్లాకు ఎవరేం చేశారో చర్చించేందుకు రావాలని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి లోకేశ్ సవాల్ విసిరారు. "చిత్తూరు అభివృద్ధికి మేము నిధులు కేటాయించాం... ఫాక్స్ కాన్, సెల్ కాన్ వంటి పరిశ్రమలు తెచ్చి వేలాదిమంది యువతకు ఉద్యోగాలిచ్చాం. పుంగనూరులో రోడ్లకు నిధులు మంజూరు చేసింది కూడా నేను పంచాయితీరాజ్ మంత్రిగా పనిచేసే సమయంలోనే. 

చిత్తూరును పెద్దిరెడ్డి కుటుంబం నమిలేస్తోంది. ఒకరికి ముగ్గురు ప్రజాప్రతినిధులు ఉన్న పెద్దిరెడ్డి అండ్ కో మదనపల్లిని ఎందుకు జిల్లా చేయలేదు? ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీగా పెద్దిరెడ్డి కుటుంబం ఉంది. జిల్లా వాళ్ల చేతిలో ఉండాలని మదనపల్లిని జిల్లా కాకుండా పెద్దిరెడ్డి అడ్డుకున్నారు. 

జిల్లాలో అడుగడుగునా నేను చేసిన అభివృద్ధే కనబడుతోంది. మదనపల్లి ప్రజలకు నేను హామీ ఇస్తున్నా. అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే పీలేరు, మదనపల్లి, పుంగనూరు, తంబళ్లపల్లిని కలిపి  జిల్లా చేస్తా. మదనపల్లి జిల్లా కేంద్రంగా ఉంటుంది" అని లోకేశ్ స్పష్టం చేశారు.

బిల్డప్ బాబాయిని గుర్తుకుతెస్తున్న జగన్!

జగన్ ను చూస్తే బిల్డప్ బాబాయ్ గుర్తుకు వస్తాడని లోకేశ్ ఎద్దేవా చేశారు. "మన పాదయాత్రకు ముందు తన వెంట్రుక కూడా పీకలేరన్నాడు... సింహం సింగిల్ గా వస్తుందన్నాడు. కానీ పాదయాత్రకు యువత, మహిళలు, విద్యార్థులు, కార్మికులు వచ్చి సంఘీభావం తెలిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు జగన్ ట్యూన్ మారింది. అందుకే... ప్లీజ్ ఒంటరిగా రండి అని దేబిరిస్తున్నాడు. అందుకే ఆయన్ని బిల్డప్ బాబాయ్ అంటున్నా. 

జగన్ కు ప్రజలు భయాన్ని పరిచయం చేశారు. ఎక్కడ టమోటాలు, గుడ్లు వేస్తారోనని పరదాలు కట్టుకుంటున్నారు. కానీ మీ లోకేశ్  ప్రజల మధ్య తిరుగుతున్నాడు" అని పేర్కొన్నారు.

సన్ రైజ్ స్టేట్ ని ఫినిష్ ఆంధ్రాగా మార్చాడు!

టీడీపీ హయంలో సన్ రైజ్ స్టేట్ గా ఏపీ ఉంది. కానీ ఇప్పుడు ఫినిష్ ఏపీగా ఉంది. చంద్రబాబు ఉన్నప్పుడు అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల్లా ఉన్నాయి. జగన్ హయాంలో జాబ్ లు నిల్, గంజాయి ఫుల్. చంద్రబాబు పాలనలో కియా వస్తే... జగన్ హయాంలో ఫినిష్ ఆంధ్ర వచ్చింది. చంద్రబాబు కానుకలు ఇస్తే... జగన్ మాత్రం బూమ్ బూమ్, ఆంధ్రాగోల్డ్ వంటి మందులు ఇచ్చారు. ఉద్యోగాలు, ఉపాధిలో చంద్రబాబు నెంబర్ వన్ గా రాష్ట్రాన్ని చేస్తే... జగన్ మాత్రం ఇంటి పన్నులు, పెట్రోల్ డీజల్ ధరల పెరుగుదలలో నెంబర్ వన్ చేశాడు" అని విమర్శించారు.

టమాటా మార్కెట్ ను దత్తత తీసుకుంటా!

టమాటా రైతులను జగన్ గతంలో కలిశాడని, జ్యూస్ ఫ్యాక్టరీ తెస్తానన్నాడని లోకేశ్ వెల్లడించారు. కానీ, ఆ హామీని జగన్ రెడ్డి మర్చిపోయాడని విమర్శించారు. "టమాటా రైతులకు హామీ ఇస్తున్నా. మదనపల్లి టమోటా మార్కెట్ ను నేను దత్తత తీసుకుంటా. మీరు చూపిన ప్రేమ, ఆదరణ, గౌరవం మర్చిపోలేను. మదనపల్లిలో అడుగుపెట్టినప్పటి నుండి నాకు ఘన స్వాగతం పలికి ఆశీర్వదించారు" అని పేర్కొన్నారు.

పేద‌ల నోటికాడ కూడు లాగేయ‌డం శాడిజం జగన్!

మదనపల్లిలో తాళాలు వేసి ఉన్న అన్నా క్యాంటీన్ వద్ద సెల్ఫీ దిగిన లోకేశ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వ హ‌యాంలో ఆక‌లి తీర్చడ‌మే అన్నా క్యాంటీన్లు చేసిన పాప‌మా? క్యాంటీన్ ముందు అన్నా అని పేరుండ‌డమే వాటి పాలిట‌ శాప‌మా? అని మండిపడ్డారు. 

"సీఎం అయిన వెంట‌నే రంగులు మార్చావు, తాళాలేశావు, చివ‌రికి మూతేశావు. పేద‌ల నోటికాడ కూడు లాగేయ‌డాన్ని శాడిజం అంటారు జ‌గ‌న్ రెడ్డి గారూ! అన్నాక్యాంటీన్ పేరు నీకు న‌చ్చలేదంటే... పేద‌ల్ని జ‌ల‌గ‌ల్లా పీల్చేస్తున్న నీ దుర్మార్గ పాల‌నకి గుర్తుగా జ‌ల‌గ‌న్న క్యాంటీన్లు అని పేరుమార్చి న‌డిపినా పేద‌ల ఆక‌లి తీరేది" అంటూ వ్యాఖ్యానించారు.


యువగళం పాదయాత్ర వివరాలు

*ఇప్పటి వరకు నడిచిన దూరం కి.మీ. 519.6 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం – 9.1 కి.మీ.*

*యువగళం పాదయాత్ర 41వ రోజు షెడ్యూల్ (11-3-2023)*

*తంబళ్లపల్లి నియోజకవర్గం*

ఉదయం

9.00 – నందిరెడ్డివారిపల్లి చేనేతనగర్ క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

9.20 – నందిరెడ్డివారిపల్లి విశ్వం కాలేజి వద్ద కురుబలతో సమావేశం

9.40 – తట్టివారిపల్లిలో స్థానికులతో మాటామంతీ.

10.15 – అంగళ్లు గ్రామంలో స్థానికులతో భేటీ.

11.40 – దొమ్మనబావి (తెట్టి పంచాయితీ)లో భోజన విరామం.

మధ్యాహ్నం

1.25 – దొమ్మనబావినుంచి పాదయాత్ర కొనసాగింపు.

సాయంత్రం

3.25 – కంటేవారిపల్లిలో కుమ్మరి సామాజికవర్గీయులతో సమావేశం.

4.00 – కంటేవారిపల్లి విడిది కేంద్రంలో బస. 


More Telugu News