రతన్ టాటాకు ఇన్ స్టాలో 85 లక్షల మంది ఫాలోవర్లు... ఆయన ఫాలో అయ్యేది మాత్రం ఒక్కరినే!

టాటా గ్రూపును అగ్రగామి సంస్థగా తీర్చిదిద్దిన వ్యాపార దిగ్గజం రతన్ టాటా ప్రస్తుతం టాటా సన్స్ సంస్థకు గౌరవ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఆయన వ్యాపార దక్షత, దాతృత్వ సేవల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 85 ఏళ్ల రతన్ టాటా సోషల్ మీడియాలో అప్పుడప్పుడు పోస్టులు పెడుతుంటారు. స్నేహితులు, ఇతర శ్రేయోభిలాషులను సోషల్ మీడియా వేదికగా పలకరిస్తూ, వివిధ సందర్భాల్లో శుభాకాంక్షలు తెలుపుతుంటారు. 

ఆయన నుంచి వచ్చే పోస్టులు తక్కువే అయినప్పటికీ, ఆయనను లక్షల సంఖ్యలో అనుసరిస్తుంటారు. రతన్ టాటాకు ఇన్ స్టాగ్రామ్ లో 85 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే ఆయన ఫాలో అయ్యేది మాత్రం ఒక్కరినే. టాటా గ్రూపు తరఫున సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించే టాటా ట్రస్ట్ ను ఆయన ఫాలో అవుతుంటారు. 

టాటా ట్రస్ట్ కార్యకలాపాలు రతన్ టాటా ఆధ్వర్యంలోనే కొనసాగుతుంటాయి. ఈ ట్రస్టు 1919లో ప్రారంభమైంది. భారత్ లోని ప్రాచీన దాతృత్వ సంస్థల్లో టాటా ట్రస్ట్ కూడా ఒకటి. 

ఇక, రతన్ టాటా చివరిసారిగా జనవరి 15న ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. తమ టాటా ఇండికా కారును ఆవిష్కరించి 25 ఏళ్లయిన సందర్భంగా ఆ కారు పక్కన తాను నిలబడి ఉన్న ఫొటోను రతన్ టాటా పోస్ట్ చేశారు.


More Telugu News