Tollywood: ఇండిగో విమాన సిబ్బందిపై మంచు లక్ష్మి తీవ్ర ఆగ్రహం

  • నిన్నతిరుపతి నుంచి హైదరాబాద్ వచ్చిన లక్ష్మి
  • ఇండిగో విమానంలో తన బ్యాగ్ మర్చిపోయానని ఫిర్యాదు
  • గంట పాటు ఎదురు చూసినా సిబ్బంది స్పందించలేదని వరుస ట్వీట్లు చేసిన లక్ష్మి
Manchu Lakshmi expressed her anger at the flight crew

మంచు మోహన్ బాబు కూతురు, నటి మంచు లక్ష్మికి ఇండిగో విమానంలో చేదు అనుభవం ఎదురైంది. విమానంలో తన బ్యాగ్ మరచిపోవడంతో గేటు బయట గంటకు పైగా కూర్చోవాల్సి వచ్చిందని ఆమె ట్వీట్ చేశారు. ఆ సమయంలో తాను 103 డిగ్రీల జ్వరంతో ఉన్నా.. ఇండిగో సిబ్బంది పట్టించుకోకపోవడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. 

సోమవారం తిరుపతి నుంచి మంచు లక్ష్మి హైదరాబాద్ వచ్చారు. శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన ఆమె ఈ క్రమంలో తన బ్యాగ్ ను మరచిపోయారు. విషయాన్ని విమాన సిబ్బందికి తెలిపారు. అయితే, దాదాపు 40 నిమిషాల పాటు గేటు బయట వెయిట్ చేశానని, సిబ్బంది ఎవరూ కూడా అసలు పట్టించుకోలేదని ఇండిగోను ట్యాగ్ చేస్తూ లక్ష్మి ట్వీట్ చేశారు. తాను 103 డిగ్రీల జ్వరంతో ఉన్నానని, తన బ్యాగ్ మరిచిపోయినట్టు సిబ్బందికి తెలిపినా స్పందించలేదన్నారు. 

తాను తిరుపతి నుంచి హైదరాబాద్ రావడానికి కూడా అంత సమయం పట్టలేదని అసహనం వ్యక్తం చేశారు. గంటకు పైగా ఎదురు చూసినా తన బ్యాగ్ తెచ్చివ్వలేదని ఆమె మరో ట్వీట్ చేశారు. గ్రౌండ్ స్టాఫ్ ఒక్కరు కూడా రాలేదని, అసలు ఒక్క కస్టమర్ సర్వీస్ కూడా లేకుండా ఇండిగో ఎలా నడుస్తోందంటూ ఆమె ప్రశ్నించారు. ‘బ్యాన్ ఇండిగో’ అని హ్యాష్ ట్యాగ్ జత చేశారు. చివరకు స్పందించిన ఇండిగో అసౌకర్యానికి క్షమాపణ చెప్పింది. తమ మేనేజర్ తో మాట్లాడించినట్టు ట్వీట్ చేసింది. ‘మా మేనేజర్ మీకు సహకరిస్తారు.. మీరు లగేజ్ కలెక్ట్ చేసుకుని ఉంటారని భావిస్తున్నాం. తిరిగి మీరు మా ఫ్లైట్‌లో ప్రయాణిస్తారని ఆశిస్తున్నాం’ అని ఇండిగో పేర్కొంది.

More Telugu News