Nara Lokesh: ​​దిశ పోలీస్ స్టేషన్ వద్ద లోకేశ్ సెల్ఫీ ... ఈనాటి పాదయాత్ర వివరాలు

  • యువగళం పాదయాత్రకు నేడు 27వ రోజు
  • నేడు సాయంత్రం ప్రారంభమైన పాదయాత్ర
  • భవన నిర్మాణ కార్మికులను కలిసిన లోకేశ్
  • తిరుపతి ఎమ్మెల్యే భూమనపై విమర్శలు
  • దిశ చట్టం ఎటుపోయిందంటూ వ్యంగ్యం
Lokesh takes selfie at Disha PS in Tirupati

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 27వ రోజు (శనివారం) తిరుపతిలో కార్యకర్తలు, అభిమానుల నీరాజనాల నడుమ ఉత్సాహంగా సాగింది. 

తిరుపతి నగరానికి చెందిన పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీ గజమాలలతో యువనేతకు నీరాజనాలు పలికారు. మంగళ వాయిద్యాలు, తీన్మార్, షింకరి మేళంతో లయబద్దమైన వాయిద్యాలు, ఉరకలెత్తే ఉత్సాహం నడుమ పాదయాత్ర సాగింది. నేడు అంకుర హాస్పటల్ సమీపంలోని విడిది కేంద్రం నుంచి సాయంత్రం 4.30గంటల ప్రాంతంలో పాదయాత్ర ప్రారంభమైంది. 


భవన నిర్మాణ కార్మికులతో  భేటీ

తిరుపతిలోని అంకుర ఆసుపత్రి సమీపంలోని విడిదికేంద్రంలో భవన నిర్మాణ కార్మికులతో యువనేత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేశ్ కార్మికుల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ... ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇసుకపై ఏడాదికి రాష్ట్రవ్యాప్తంగా రూ.5 వేలకోట్లు దోచుకుంటున్నాడని, ఒక్క చిత్తూరు జిల్లాలోనే రోజుకు రూ.3 కోట్లరూపాయలు వసూలు చేస్తున్నాడని ఆరోపిస్తూ, ఈ దోపిడీని తాను ఆధారాలతో సహా నిరూపించగలనని సవాల్ విసిరారు.  

ఏపీలో బంగారం సులభంగా దొరుకుంది కానీ ఇసుక దొరకదని వ్యంగ్యం ప్రదర్శించారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే మెరుగైన ఇసుక పాలసీ తెచ్చి, ధర తగ్గిస్తామని తెలిపారు. 

"మీకు ప్రత్యేక చట్టం తీసుకొచ్చి బోర్డు ఏర్పాటు చేసి, కాంట్రాక్టు వర్కులో సెస్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించేవాళ్లం. ఆర్థికంగా మిమ్మల్ని ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన బోర్డు అది. రూ.850 కోట్లు ఈ ప్రభుత్వం బోర్డు నుండి దారి మళ్లించింది. 1214 సర్క్యులర్ తెచ్చి బీమా క్లెయిమ్ చేయొద్దొని నిబంధనలు పెట్టారు. భవన నిర్మాణ కార్మికులకు కట్టే ఆసుపత్రి భూమిని కూడా వేరే దానికి కేటాయించుకున్నారు. టీడీపీ హయాంలో పనిముట్లు ఇచ్చాం... అన్న క్యాంటీన్ మీకోసం ఏర్పాటు చేశాం" అని వివరించారు.

తిరుపతి ఎమ్మెల్యే పుత్రరత్నం అడ్డగోలు దోపిడీ!

తిరుపతికి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారని లోకేశ్ వ్యాఖ్యానించారు. తండ్రి మద్యం తాగొద్దు అంటే... మద్యం సిండికేట్ ఏర్పాటు చేసింది మాత్రం కొడుకు అభినయ్ రెడ్డి అని విమర్శించారు. 

"తిరుపతిలో భూముల రిజిస్ట్రేషన్ ఆపింది కూడా ఎమ్మెల్యే కొడుకే. ఇక్కడ కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యే కాదు... అభినయ్ రెడ్డి ఎమ్మెల్యే. తన స్నేహితులను రిజిస్ట్రేషన్ ఆఫీసుల ముందు కూర్చోబెడతారు. బోరు వేయాలన్నా, ప్రహరీ కట్టాలన్నా అభినయ్ రెడ్డికి కప్పం కట్టాలి. కరుణాకర్ ది తిరుపతి కాదు... కడప జిల్లా. తిరుపతిలో 2,300 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయకుండా ఈ ఎమ్మెల్యే కొడుకు ఆపేశారు. జగన్ పెద్ద దొంగ... అభినయ్ రెడ్డి చిన్నదొంగ. దేవుడి టికెట్లు కూడా అమ్ముకుంటున్నారు" అంటూ లోకేశ్ మండిపడ్డారు.

కార్పెంటర్లకు వర్క్ షెడ్లను నిర్మిస్తాం!

కార్పెంటర్లకు వర్క్ షెడ్ ప్రభుత్వం నిర్మించి దానికి సర్వీస్ ఛార్జ్  మాత్రమే వసూలు చేసేలా చేస్తామని లోకేశ్ వెల్లడించారు. పెన్షన్ పరిమితి వయసు తగ్గించాలని చాలా మంది అడుగుతున్నారు. ఇది అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. 2019కి ముందు ఇసుక ధర, పెయింట్ ధర, చెక్క ధర ఎంత ఉందో ఇప్పుడు ఎంత ఉందో కార్మికులు ఆలోచించాలి. ఉచితంగా ఏమీ వద్దు... చేతి నిండా పని చూపించండని కార్మికులు అడుగుతున్నారు. జగన్ లా ఊరూరా హామీలిచ్చి... ఆ తర్వాత నాకు తెలీదు, హామీ ఇవ్వలేదు అని నేను అనను" అంటూ లోకేశ్ స్పష్టం చేశారు.

దిశ పోలీస్ స్టేషన్ వద్ద సెల్ఫీ దిగిన లోకేశ్

తిరుపతి పట్టణంలో పాదయాత్ర దారిలో దిశ పోలీస్ స్టేషన్ వద్ద కొద్దిసేపు ఆగిన లోకేశ్  సెల్ఫీ దిగి, ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. "అస‌లు దిశ చ‌ట్టమే లేదు కానీ పోలీస్ స్టేషన్లు మాత్రం ఏర్పాటు చేశారు. మ‌హిళ‌ల‌పై దాడుల‌కి పాల్పడితే 21 రోజుల్లో నిందితుల్ని శిక్షించే దిశ చ‌ట్టం తెచ్చామ‌ని సిగ్గులేకుండా ప్రచారం చేసుకుంటున్నారు. 

సీఎం ఇంటికి స‌మీపంలో అంధ ద‌ళిత యువ‌తిని న‌రికి చంపేస్తే, గంజాయి తాగి కాదు... మ‌ద్యం తాగి చంపాడు, అదేం అంత పెద్ద నేరం కాద‌ని మ‌హిళా హోం మంత్రి చెప్పిన తీరు రాష్ట్రంలో మ‌హిళ‌ల ప్రాణాల‌కు ర‌క్షణ‌లేద‌ని తేల్చేసింది.

ఇప్పటివ‌ర‌కూ మ‌హిళ‌ల‌పై దాడిచేసిన నిందితుల‌లో ఒక్కరిపైన కూడా దిశ‌చ‌ట్టం కింద‌ కేసు పెట్టలేదు. అంటే చ‌ట్టమే లేద‌ని తేలిపోతోంది. జ‌గ‌న్ చేసిన వంద‌ల మోసాల్లో ఇదొక మోసం. నా పాద‌యాత్ర తిరుప‌తి ప‌ట్టణం రైల్వేస్టేష‌న్ రోడ్డులో సాగుతుండ‌గా దిశ పోలీస్ స్టేష‌న్ క‌నిపించింది. సెల్ఫీ తీశాను. జ‌గ‌న్ రెడ్డి గారు మ‌రో ఏడాదిలో ఇంటికెళిపోతున్నారు... మీరు తెచ్చాన‌ని చెబుతున్న దిశ చ‌ట్టం ఏ దిక్కుకు పోయిందో చెబుతారా?" అంటూ యువనేత వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర వివరాలు:

ఇప్పటి వరకు నడిచిన దూరం కి.మీ. 354.1 కి.మీ.

27వరోజు (శనివారం) నడిచిన దూరం – 9.5 కి.మీ.

యువగళం పాదయాత్ర 28వ రోజు షెడ్యూల్(26-2-2023)

తిరుపతి నియోజకవర్గం: 

ఉదయం
8.00  – తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు సర్కిల్ విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం.
8.10  – తిరుచానూరులో అమ్మవారి దర్శనం.
8.55 -  తిరుచానూరు ప్రజలతో ముఖాముఖి.
9.15 – వసుంధర నగర్ వాసులతో మాటామంతీ.
10.30 – తనపల్లిలో రైతులతో సమావేశం
మధ్యాహ్నం
12.10 – భాగ్యనగరంలో భోజన విరామం.
1.10 -  భాగ్యనగరంలో బీసీ సామాజికవర్గీయులతో సమావేశం.
2.10 – భాగ్యనగరం నుంచి పాదయాత్ర కొనసాగింపు.
2.25 – కాపుచంద్రపేటలో స్థానికులతో మాటామంతీ.
2.40 – దుర్గసముద్రంలో స్థానికులతో ముఖాముఖి.
సాయంత్రం
4.35 – అడపారెడ్డిపల్లి స్థానికులతో మాటామంతీ.
5.25 – శివగిరి విడిది కేంద్రంలో బస.

More Telugu News