బెడ్ రూములో కిందపడడంతోనే తలకు గాయం.. వాణీ జయరాం మృతిపై అనుమానాల్లేవు: పోలీసుల వివరణ

  • అపార్ట్‌మెంట్ ప్రాంగణంలోని సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు
  • ఎక్కడా అనుమానాస్పద కదలికలు కనిపించలేదని స్పష్టీకరణ
  • ప్రభుత్వ లాంఛనాల మధ్య ముగిసిన వాణి అంత్యక్రియలు
ప్రముఖ నేపథ్య గాయని వాణీ జయరాం(78) మృతిపై నెలకొన్న అనుమానాలను చెన్నై పోలీసులు పటాపంచలు చేశారు. బెడ్రూంలో కిందపడడంతో తలకు బలమైన దెబ్బతగిలి మృతి చెందినట్టు ఫోరెన్సిక్ నివేదికలో తేలినట్టు పోలీసులు తెలిపారు. ఆమె నివసిస్తున్న అపార్ట్‌మెంట్ ప్రాంగణంలోని సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించామని, ఎక్కడా అనుమానాస్పద కదలికలు కనిపించలేదన్నారు.

వాణి జయరాం మృతిపై అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో చెన్నై ట్రిప్లికేన్ అసిస్టెంట్ కమిషనర్ దేశ్‌ముఖ్ శేఖర్ సంజయ్, పోలీసు ఉన్నతాధికారులు ఆమె నివాసానికి వెళ్లి పరిశీలించారు. నిన్న మధ్యాహ్నం తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో వాణి అంత్యక్రియలు ముగిశాయి. 

ఆమె అంతిమయాత్రలో అభిమానులు పెద్దఎత్తున పాల్గొన్నారు. అంతకుముందు ఆమెకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నివాళులు అర్పించారు. కాగా, వాణి 4 ఫిబ్రవరి 1968న జయరాంను వివాహం చేసుకున్నారు. మళ్లీ సరిగ్గా అదే రోజున ఆమె కన్నుమూశారు.

Vani Jairam
Chennai
Last Rites
Tollywood
Kollywood

More Telugu News