కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. నాలుగు శాతం పెరగనున్న డీఏ!
- ప్రస్తుతం 38 శాతంగా ఉన్న డీఏను 42 శాతానికి పెంచాలని ప్రతిపాదన
- జనవరి నుంచే అమల్లోకి రానున్న వైనం!
- గతేడాది సెప్టెంబరులో పెంచి జులై నుంచి అమలు
వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ-ఐడబ్ల్యూ) ఆధారంగా డీఏను సవరిస్తారు. ఇందులో భాగంగా గతేడాది డిసెంబరు నెలకు గాను సవరించిన సీపీఐ-ఐడబ్ల్యూను జనవరి 31న విడుదల చేశారు. ఇందులో డీఏను 4.23 శాతం పాయింట్లు పెంచాలని నిర్ణయించారు. అయితే, కేంద్రం దశాంశ స్థానాలను పరిగణనలోకి తీసుకునే అవకాశం లేదు కాబట్టి, నాలుగు శాతం పెంచే అవకాశం ఉంది.
కేంద్రం చివరిసారి గతేడాది సెప్టెంబరు 28న డీఏను పెంచి అదే ఏడాది జులై 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. కాగా, కేంద్రం ప్రతి సంవత్సరం రెండుసార్లు డీఏను సవరిస్తుంది. డీఏ పెంపు ప్రతిపాదనను ఆమోదం కోసం కేంద్ర మంత్రి వర్గం ఎదుట ఉంచుతారు. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే పెంపు ఉంటుంది. డీఏ పెంపు జనవరి ఒకటి నుంచే అమల్లోకి రానుంది.