Nara Lokesh: వచ్చే ఎన్నికల్లో జగన్ ఎమ్మెల్యేల సంఖ్యపై లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Nara Lokesh Interesting Comments On YS Jagan MLAs
షార్ట్స్‌లో చూడండి
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర నిన్న చిత్తూరు జిల్లా గుడుపల్లె, శాంతిపురం మండలాల్లో 9.3 కిలోమీటర్ల మేర సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎమ్మెల్యేల సంఖ్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ఎమ్మెల్యేల సంఖ్య ముందు ఒకటి పోతుందా? లేదంటే వెనక ఒకటి పోతుందా అనేది చూడాలని అన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు ఎన్టీఆర్ 20 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే.. చంద్రబాబు వాటిని 34 శాతానికి పెంచారని గుర్తు చేశారు. అయితే, జగన్ అధికారంలోకి వచ్చాక బీసీలకు రిజర్వేషన్లు తగ్గించి దేశంలోనే ఆ పని చేసిన ఏకైక ముఖ్యమంత్రిగా నిలిచిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ నిర్ణయంతో రాష్ట్రంలో 16 వేల మంది బీసీలు స్థానిక ఎన్నికల్లో అవకాశాలు కోల్పోయారన్నారు. ఇలాంటి ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో బీసీలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. 

అధికార పార్టీ నాయకులు తన తల్లిని అవమానిస్తూ శాసనసభలో వ్యాఖ్యలు చేసిన తర్వాత రాముడి లాంటి తన తండ్రిలోనూ మార్పు కనిపించిందని, వారి సంగతి రాముడే తేలుస్తాడని హెచ్చరించారు. ఎవరైనా దొంగతనం చేసి కోర్టుకు వెళ్తారని, కానీ ఏపీ వ్యవసాయ మంత్రి కోర్టులోనే పత్రాలు దొంగతనం చేశారని విమర్శించారు. నాలుగేళ్లుగా ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర రాలేదని అన్నారు. గిట్టుబాటు లేక టమాటా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. అలాగే, వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగింపుపైనా చర్యలు తీసుకుంటామన్నారు. చంద్రబాబు జీవితాంతం కుప్పంలోనే పోటీ చేస్తారని, బాలకృష్ణ హిందూపురంలో, తాను మంగళగిరిలో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. 

కాగా, నిన్న ఉదయం 9.50 గంటలకు గుడుపల్లె మండలం పీఈఎస్ వైద్య కళాశాల నుంచి ప్రారంభమైన లోకేశ్  పాదయాత్ర పెద్దబొమ్మనపల్లిలో ముగిసింది. రాత్రికి ఆయన అక్కడే బస చేశారు. లోకేశ్ పాదయాత్రలో ఎంపీ రామ్మోహన్ నాయుడు, మాజీ మంత్రులు అమరనాథరెడ్డి, చినరాజప్ప, దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, పీతల సుజాత, ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి, చిత్తూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు పులివర్తి నాని, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాం చినబాబు తదితరులు పాల్గొన్నారు.
Go Back to Shorts
Nara Lokesh
Yuva Galam
Chittoor District
Telugudesam

More Telugu News