Anand Mahindra: ఈ-రూపీ ఎలా వాడాలో ప్రాక్టికల్ గా చూపించిన ఆనంద్ మహీంద్రా

  • ఆర్ బీఐ సమావేశం తర్వాత పండ్లు కొనుగోలు
  • వర్తకుడికి ఫోన్ ద్వారా స్కాన్ చేసి చెల్లింపులు
  • ఈ వీడియోని ట్విట్టర్ లో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా
Anand Mahindra buys fruit using Indias digital currency e rupee shows how it works in video

మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూపు చైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ వేదికగా ఎంతో మందిని చైతన్య పరుస్తున్నారు. తాజాగా ఆయన ఈ-రూపీ వినియోగం గురించి ట్విట్టర్లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఆర్ బీఐ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ/ఈ-రూపీ)ని అభివృద్ధి చేయడం తెలిసిందే. ఇది భౌతిక కరెన్సీకి డిజిటల్ రూపం. పర్స్ లో కరెన్సీ నోట్లు ఉన్నట్టు.. వ్యాలెట్ లో ఈ రూపీలు లోడ్ చేసుకోవచ్చు. ఆర్ బీఐ ప్రస్తుతం హోల్ సేల్, రిటైల్ లావాదేవీలపై ఈ-రూపీని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తోంది. 

ముంబైలో ఆర్ బీఐ బోర్డు సమావేశానికి హాజరైన ఆనంద్ మహీంద్రా, అనంతరం అక్కడే ఉన్న ఓ పండ్ల వర్తకుడి దగ్గరకు వెళ్లారు. పళ్లు కొనుగోలు చేసిన తర్వాత ఈ-రూపీలను చెల్లించడాన్ని వీడియో తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఆనంద్ మహీంద్రా ఆర్ బీఐ సెంట్రల్ బోర్డ్ లో డైరెక్టర్ గానూ సేవలు అందిస్తున్నారు. గతేడాది ఆనంద్ మహీంద్రాను డైరెక్టర్ గా కేంద్ర సర్కారు నియమించింది. అచ్చం యూపీఐ విధానంలో స్కాన్ చేసినట్టుగానే.. స్కాన్ చేసి ఈ రూపీలను చెల్లించడాన్ని వీడియోలో చూడొచ్చు. ఈ-రూపీ వినియోగంలో ప్రాక్టికల్ గా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ప్రయోగాత్మక పరీక్షల అనంతరం వాటిని సరిదిద్దే అవకాశం ఉంది. 

‘‘రిజర్వ్ బ్యాంక్ బోర్డ్ సమావేశంలో ఆర్ బీఐ డిజిటల్ కరెన్సీ (ఈ-రూపీ) గురించి తెలుసుకున్నాను. సమావేశం తర్వాత సమీపంలోని పండ్ల వర్తకుడు బచ్చేలాల్ సహాని వద్దకు వెళ్లాను. డిజిటల్ రూపీలను ఆమోదిస్తున్న వారిలో అతడు కూడా ఒకడు. డిజిటల్ ఇండియా పనిచేస్తోంది! (పొమోగ్రనేట్స్ కొనుగోలు చేశా)’’అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.

More Telugu News