Telangana: మరో రూ. 550.14 కోట్ల 'రైతు బంధు' నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

  • ఖమ్మం బీఆర్ఎస్ సభ నవశకానికి నాంది అన్న మంత్రి నిరంజన్ రెడ్డి 
  • సీఎం కేసీఆర్ సందేశం చారిత్రాత్మకం కాబోతున్నదని వ్యాఖ్య
  • బీజేపీలో వణుకు పుడుతున్నదని ఎద్దేవా చేసిన మంత్రి 
Rs 550 crore of Rythu Bandhu funds released

రైతు బంధు పథకంలో భాగంగా తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం మరో రూ.550.14 కోట్లు విడుదల చేసింది. 11 లక్షల 306.38 ఎకరాలకు గాను 1,60,643 మంది రైతుల ఖాతాలలో జమ అయ్యేలా నిధులు విడుదల చేసినట్టు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 62,45,700 మంది రైతుల ఖాతాలలో రూ.6351.22 కోట్లు జమ చేసినట్టు వెల్లడించారు. ఇక, బుధవారం జరిగే ఖమ్మం బీఆర్ఎస్ బహిరంగసభ నవశకానికి నాంది పలకబోతున్నదని, దేశ రాజకీయ చరిత్రలో ఒక మలుపురాయిలా నిలవనున్నది ఆయన అన్నారు. 

ఖమ్మం సభలో సీఎం కేసీఆర్ సందేశం చారిత్రాత్మకం కాబోతున్నదని చెప్పారు. నాడు తెలంగాణ కోసం, నేడు దేశం కోసం కేసీఆర్ ముందడుగు వేశారని నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణ మాదిరిగానే దేశం సస్యశ్యామలం కావాలని ఆకాంక్షించారు. అన్ని రంగాలను అమ్మేసినా కేంద్రం కన్ను ఇప్పుడు ఆహారరంగం మీద పడిందని ఆయన ఆరోపించారు. కేసీఆర్ నాయకత్వంలో కేంద్రం కుట్రలను చేధిస్తామని చెప్పారు. తెలంగాణ వ్యవసాయ పథకాలు, సంక్షేమ పథకాలు దేశమంతటా అమలుకావాలని భారత ప్రజలు ఆశిస్తున్నారని నిరంజన్ రెడ్డి అన్నారు. ఇక, బీఆర్ఎస్ అడుగులు చూసి బీజేపీలో వణుకు పుడుతున్నదని, అందుకే తెలంగాణ మీద కక్షగట్టి నిధులు రాకుండా, రుణాలు అందకుండా అడ్డుపుల్లలు వేస్తున్నదని ఆరోపించారు. బీజేపీకి ప్రజలే సమాధానం చెబుతారని తెలిపారు.

More Telugu News