high speed: మార్కెట్లోకి కొత్త హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్

  • జాయ్ ఈ-బైక్ కంపెనీ నుంచి ‘మిహోస్’
  • గరిష్ఠ వేగం గంటకు 70 కిలోమీటర్లు
  • 7 సెకన్లలోనే 40 కి.మీ. స్పీడ్ అందుకుంటుంది
  • 2023 ఆటో ఎక్స్ పోలో బైక్ ను ప్రదర్శించిన కంపెనీ
Joy mihos unveiled high speed electric scooter at auto expo 2023

ఎలక్ట్రిక్ బైక్ పై స్పీడ్ గా దూసుకెళ్లాలని భావించే వారికోసం జాయ్ ఈ-బైక్ కంపెనీ సరికొత్త టూవీలర్ ను మార్కెట్లోకి తీసుకు వచ్చింది. 2023 ఆటో ఎక్స్ పోలో ఈ బైక్ వివరాలను కంపెనీ వెల్లడించింది. గంటకు గరిష్ఠంగా 70 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెడుతుందని పేర్కొంది. ‘మిహోస్’ గా నామకరణం చేసిన ఈ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్ ధరను 1.49 లక్షలు (ఎక్స్ షోరూం) గా నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది. నాలుగు రంగుల్లో తీసుకొచ్చిన ఈ బైక్ ను గుజరాత్ లోని వడోదర ప్లాంట్ లో తయారుచేస్తున్నట్లు వివరించింది. ఈ బైక్ లను దేశవ్యాప్తంగా డెలివరీ చేయనున్నట్లు వెల్లడించింది.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ నాలుగు రంగులలో లభ్యమవుతుంది. అవేంటంటే మెటాలిక్ బ్లూ, సాలిడ్ బ్లాక్ గ్లోసీ, సాలిడ్ ఎల్లో గ్లోసీ, పెర్ల్ వైట్. దీని ధర రూ. 1,49,000 ఎక్స్-షోరూమ్ (పాన్ ఇండియా) ఉంది. గుజరాత్‌ వడోదరలోని కంపెనీ తయారీ కేంద్రంలో దీనిని తయారుచేసి.. దశల వారీగా దేశ వ్యాప్తంగా డెలివరీలు చేయనున్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది.

అదిరే ఫీచర్లు..
రెట్రో డిజైన్‌ తో ఈ స్కూటర్ చూడడానికి ఆకర్షణీయంగా ఉంది. రెండు హెడ్ లైట్లు, సర్క్యూలర్ డిజైన్ లో వెనక అద్దాలు, కర్వీ బాడీ ప్యానెల్ తో డిజైన్ చాలా అందంగా ఉంది. ఆప్రాన్-మౌంటెడ్ టర్న్ ఇండికేటర్‌లు, ముందు టెలిస్కోపిక్ ఫోర్క్‌లపై, వెనుక మోనో-రివర్సిబుల్ స్ప్రింగ్ సస్పెన్షన్‌ ను ఏర్పాటు చేశారు. స్టాండ్ సెన్సర్, హైడ్రాలిక్ కాంబి బ్రేకింగ్ సిస్టమ్ లతో పాటు బ్లూటూత్ కనెక్టివిటీ, బ్యాటరీకి రిమోట్ యాక్సెస్, రివర్స్ మోడ్, జీపీఎస్, యాంటీ-థెఫ్ట్, రీజనరేటివ్ బ్రేకింగ్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.

నాలుగు గంటల్లో ఫుల్ చార్జింగ్..
మిహోస్ ఎలక్ట్రిక్ స్కూటర్ చార్జింగ్ కు 4 గంటలు సరిపోతుందని కంపెనీ పేర్కొంది. ఒక్కసారి ఫుల్ చార్జింగ్ చేస్తే వంద కిలోమీటర్లు దీనిపై ప్రయాణించవచ్చని చెప్పింది. 74వి40ఏహెచ్ లియాన్ ఆధారిత బ్యాటరీని, 1500 వాట్స్ ఎలక్ట్రిక్ మోటార్ ను ఈ స్కూటర్ లో అమర్చినట్లు తెలిపింది. కేవలం ఏడు సెకన్ల వ్యవధిలో జీరో నుంచి 40 కిలోమీటర్ల స్పీడ్ అందుకుంటుందని వివరించింది.

More Telugu News