Meerut: ఈ ఉంగరంలో 26 వేల వజ్రాలున్నాయట..

  • 26,200 వజ్రాలతో పొదిగిన ఉంగరం తయారు చేసిన యూపీ సంస్థ
  • ప్రపంచంలోనే అత్యధిక వజ్రాలతో పొదిగిన ఉంగరం ఇదే
  • పువ్వు ఆకారంలో ఉన్న ఉంగరానికి ‘దేవ్ ముద్రిక’ అనే పేరు
Meerut jeweler designs ring with 26200 diamonds breaks world record

వజ్రం చాలా ఖరీదైనది. సాధారణంగా వజ్రాలు పొదిగిన ఉంగరంలో మహా అయితే నాలుగైదు వజ్రాలు ఉంటేనే ఎక్కువ. అలాంటిది ఓ ఉంగరంలో 26 వేల వజ్రాలు ఉన్నాయంటే నమ్మగలమా!. ఏకంగా 26,200 వజ్రాలతో పొదిగిన ఉంగరాన్ని తయారు చేసి రికార్డు సృష్టించింది ఓ సంస్థ. ఉత్తరప్రదేశ్ లోని మీరట్ కు చెందిన డాజ్లింగ్ జ్యువెలరీ అనే అభరణాల తయారీ సంస్థ ప్రపంచంలోనే అత్యధిక వజ్రాలతో పొదిగిన ఉంగరాన్ని తయారు చేసింది. పువ్వు ఆకారంలో ఉన్న ధగధగ మెరుస్తున్న ఈ ఉంగరానికి ‘దేవ్ ముద్రిక’ అని పేరు పెట్టినట్టు సంస్థ యజమాని విపుల్ అగర్వాల్ చెప్పారు. ఇది వరకు ఓ సంస్థ 24 వేల వజ్రాలు పొదిగిన ఉంగరాన్ని తయారు చేసిందన్నారు.

26,200 వజ్రాలు ఉపయోగించి ఆ రికార్డును తాము బద్దలు కొట్టామని చెప్పారు. మొదట సాఫ్ట్ వేర్ ద్వారా ‘దేవ్ ముద్రిక’ డిజైన్ ను రూపొందించామన్నారు. తర్వాత కళాకారులతో తయారు చేయించామని వెల్లడించారు. పది మంది కళాకారులు మూడు నెలలు పాటు కష్టపడి ఉంగరానికి తుది రూపు ఇచ్చినట్టు తెలిపారు. రెండు వేళ్లకు పెట్టుకునే ఈ ఉంగరానికి ధర ఇంకా నిర్ణయించలేదన్నారు.  గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సులో చోటు కోసం దరఖాస్తు చేస్తామని తెలిపారు. అందులో స్థానం సంపాదించిన తర్వాత ధర వెల్లడిస్తామని చెప్పారు.

More Telugu News