Rahul Gandhi: భారత్ జోడో యాత్రలో రాహుల్ తో పాదం కలిపిన శునకం

  • హర్యానా రాష్ట్రంలోకి ప్రవేశించిన రాహుల్ పాదయాత్ర
  • అతడితో కలసి నడిచిన ప్రియాంక పెంపుడు కుక్క లూనా
  • తన లూనా అపహరణకు గురైందంటూ ప్రియాంక ఫన్నీ పోస్ట్
Rahul Gandhi shares pic with sister Priyankas dog Luna

కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చివరి దశలో ఉన్నారు. మధ్య మధ్యలో వివిధ రాష్ట్రాల పరిధిలో అక్కడి నాయకులు కూడా రాహుల్ తో కొద్ది దూరం పాటు నడిచి తమ వంతు మద్దతు తెలియజేస్తున్నారు. నటుడు కమల్ హాసన్, ఆర్ బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్, ఇలా చాలా మంది ఆయనతో కలసి పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపినవారే.

అయితే, వీరే కాదు రాహుల్ సోదరి, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ పెంపుడు శునకం కూడా రాహుల్ పాద యాత్రలో పాల్గొనడం ఆసక్తికరం. దీని పేరు లూనా. శనివారం రాహుల్ భారత్ జోడో యాత్ర హర్యానా రాష్ట్రంలోకి ప్రవేశించింది. రాహుల్ పాదయాత్ర చేస్తున్న సమయంలో లూనా కూడా కొద్ది దూరం నడిచింది. దీనికి సంబంధించి ఫొటోను రాహుల్ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. బాక్సర్ విజేంద్ర సింగ్ సైతం రాహుల్ జత కలిశారు. 

రాహుల్ తో కలసి లూనా నడుస్తున్న ఫొటోను ప్రియాంకా సైతం ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసి, హాస్యంగా క్యాప్షన్ పెట్టారు. ‘లూనా అపహరణకు గురైంది’అని పేర్కొన్నారు. దీనికి రాహుల్ స్పందిస్తూ.. ‘ఆందోళన చెందకు ప్రియాంక, మేము వాకింగ్ కు వెళుతున్నామంతే’ అని కామెంట్ చేశాడు.

More Telugu News